కేసీఆర్​పై ఈసీ సీరియస్​

కేసీఆర్​పై ఈసీ సీరియస్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లపై ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌‌‌‌కు చేరేలా వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. పార్టీ అధినేతగా, గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ తెలిపారు. తెలంగాణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి రిపోర్టు తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేశామని స్పష్టం చేశారు. 

పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని చెప్పారు. ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9న లేఖ రాశామని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని పేర్కొన్నారు. అలాగే సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల 10న వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లను పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన వివరణలతో కమిషన్ ఏకీభవిస్తున్నదని, కోడ్ ఉల్లంఘనలకు కేసీఆర్ పాల్పడ్డారనే నిర్ధారణకు వచ్చామని నోటీసుల్లో పేర్కొన్నారు.

జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్న రిపోర్టులో కేసీఆర్ చేసిన కామెంట్లలో కొన్ని..

 “నిరోధ్‌‌‌‌లు, పాపడాలు అమ్ముకుని బతకాలంటూ కాంగ్రెస్ నాయకుడొకరు సలహా ఇస్తున్నారు”అని ప్రస్తావించి “కుక్కల కొడుకుల్లారా”.. అంటూ కేసీఆర్ కామెంట్ చేశారు.
 సాగు, తాగునీటి సమస్యల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ.. “ఈ పరిస్థితికి కారణం నీటి సామర్థ్యం గురించి కూడా తెలియని లత్కోరులే. చవట, దద్దమ్మల పాలన వల్లనే ఈ పరిస్థితి దాపురించింది”.
 “ఇది లతుకోరు గవర్నమెంటు.. కేవలం 1.8% ఓట్ల మెజారిటీతోనే గెలిచింది.. పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది..”
 “ప్రభుత్వంలో ఉన్న చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు” అంటూ కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు.
 రైతులకు వరి కోనుగోలుపై క్వింటాల్‌‌‌‌కు రూ.500 చొప్పన బోనస్ ఇచ్చే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ“బోనస్ ఇవ్వకపోతే మీ గొంతుల్ని కోసేస్తం.. చంపేస్తం”.. అని అన్నారు.

గతంలోనే హెచ్చరించినా.. మళ్లీ రిపీట్ 

ఈ కామెంట్లన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పార్ట్-1లోని ఒకటో భాగంలోని రూల్స్​ ఉల్లంఘించడమేనని అవినాశ్ తెలిపారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలపుడు బాన్సువాడలో జరిగిన ప్రచార సభలోనూ ఇలాంటి పరుష కామెంట్లు చేసి కోడ్ ఉల్లంఘించారని గుర్తుచేశారు. లీడర్లపై వ్యక్తిగతంగా కామెంట్లు చేయొద్దని, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఇమేజ్‌‌‌‌ను దెబ్బతీసేలా మాట్లాడొద్దని ఈ జనవరి 2న, మార్చి 1న ఆయనకు లేఖలు రాసినా.. మళ్లీ రిపీట్ చేస్తున్నట్లు చెప్పారు.