టీఆర్ఎస్​కు సిలిండర్ గుర్తు.. షరతులతో ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

టీఆర్ఎస్​కు సిలిండర్ గుర్తు.. షరతులతో ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. ఆ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కనీస శాతం సీట్లలో సదరు పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులు కలిసి సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం ఈ పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 సెగ్మెంట్లలో పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకున్నది. విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో ఉత్తర్వులు జారీ చేసింది. బాలరంగం 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్నారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. 2001లో సిద్దిపేట మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో సిద్దిపేట మండల జడ్పీటీసీ సభ్యుడిగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్న బాలరంగం సికింద్రాబాద్ లోని ఓల్డ్ అల్వాల్ లో ఉన్న తన ఇంటి చిరునామాను పార్టీ ఆఫీసు అడ్రస్ గా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే.