- వ్యవస్థలోని అడ్డంకులను తొలగిస్తున్నాము: పీయూష్ గోయల్
చెన్నై: దేశ ఎకానమీ 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల (రూ.2,340 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని కేంద్ర టెక్స్టైల్, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. వ్యవస్తీకృతంగా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో టారిఫ్ లు, ట్యాక్స్లకు సంబంధించి సమస్యలు, గ్లోబల్ కాంపిటేటివ్నెస్కు సంబంధించిన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని సెక్టార్లలోనూ గ్లోబల్గా విస్తరించాలని ఇండియా చూస్తోందని చెప్పారు. కాగా, ప్రస్తుతం దేశ ఎకానమీ 3 ట్రిలియన్ డాలర్లు (రూ. 234 లక్షల కోట్లు) గా ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీలోని భారీగా అవకాశాలు ఉన్నాయని, రానున్న మరికొన్నేళ్లలో పెద్ద మొత్తంలో జాబ్స్ క్రియేట్ చేసే సత్తా ఈ సెక్టార్కు ఉందని కొయంబత్తూర్లోని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన వివరించారు. గ్లోబల్ మార్కెట్లో దేశ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాటాను పెంచేందుకు వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) లను కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు.
ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లో మన టెక్స్టైల్ సెక్టార్ ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. టెక్స్టైల్స్, పంపులు, వెట్ గ్రైండర్లు, కీలకమైన విడి భాగాల తయారీకి హబ్గా తమిళనాడు రాష్ట్రం ఎదుగుతుందని మంత్రి గోయల్ పేర్కొన్నారు. కాగా, టెక్స్టైల్ సెక్టార్ కోసం మరో పీఎల్ఐ స్కీమ్ను కూడా తీసుకొస్తామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. పత్తి దిగుమతులపై సుంకాలను సెప్టెంబర్ తర్వాత నుంచి తిరిగి వసూలు చేస్తామని పేర్కొన్నారు.