- నిందితులు, చైర్మన్, సెక్రటరీ, కస్టోడియన్స్ను విచారించేందుకు రెడీ
- సత్యనారాయణ, శంకరలక్ష్మిని ప్రశ్నించనున్న అధికారులు
- ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని విచారించేందుకు పర్మిషన్ కోసం కోర్టులో పిటిషన్
- కేస్ డాక్యుమెంట్ల కోసం సిట్కు రాసిన లెటర్ కూడా అటాచ్
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తు చివరి దశకు చేరడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంటర్ అయ్యింది. కేసులో నిందితులు, టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ సహా కమిషన్ కస్టోడియన్స్ను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని బుధ, గురువారాల్లో ప్రశ్నించనుంది. విచారణకు హాజరుకావాలంటూ వీరిద్దరికీ సోమవారమే నోటీసులు జారీ చేసింది.
బేగంబజార్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచే దర్యాప్తు ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ కేసులో సత్యనారాయణ ఫిర్యాదుదారుడు కావడంతో ముందుగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. సత్యనారాయణ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి, చైర్మన్ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ సహా టీఎస్పీఎస్సీ సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. పేపర్ లీకేజీతో చేతులు మారిన డబ్బు, కొనుగోలు చేసిన ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేయనున్నారు.
ఈడీ పిటిషన్పై ఇయ్యాల తీర్పు!
చంచల్గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 6న నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మార్చి 11న బేగంబజార్ పీఎస్లో రిజిస్టరైన ఎఫ్ఐఆర్, 14న సీసీఎస్ పీఎస్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ల వివరాలను పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారి, మరో నలుగురు అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ల్యాప్టాప్, ప్రింటర్, విచారణకు అవసరమైన ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ను తీసుకువెళ్లేందుకు వీలుగా చంచల్గూడ జైల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై బుధవారం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ‘‘టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పి.ప్రవీణ్కుమార్ పేపర్స్ హ్యాక్ చేశాడనే ఫిర్యాదుతో గత నెల 11న బేగంబజార్ పీఎస్లో అతడిపై కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం టీఎస్పీఎస్సీ పేషీలోని సెక్షన్ ఆఫీసర్ కాన్ఫిడెన్షియల్ పాస్వర్డ్తో ప్రవీణ్ లాగిన్ అయ్యాడు. సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ను నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి టార్గెట్ చేశాడు. డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా క్రియేట్ చేశారు. మార్చి 5న జరగాల్సిన అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)తో పాటు 25 క్వశ్చన్ పేపర్స్ను పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకున్నారు. వీటిని మహబూబ్నగర్ గురుకుల టీచర్ రేణుకకు రూ.10 లక్షలకు అమ్మేశారు. పేపర్ లీకేజీతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న వేల మంది యువతపై తీవ్ర ప్రభావం చూపింది” అని తన పిటిషన్లో ఈడీ పేర్కొంది. మరోవైపు పేపర్ లీకేజీపై మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. పేపర్స్ సేల్ వల్ల మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలోనే నిందితుల స్టేట్మెంట్స్, పంచనామా, రిమాండ్ రిపోర్ట్స్, నిందితుల వద్ద గుర్తించిన డబ్బు, బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించాలని గత నెల 23న సీసీఎస్ ఏసీపీకి రాసిన లెటర్ను పిటిషన్కు అటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ జరిగిందా?
ఈ కేసులో ఇప్పటికే సిట్ రూ.40 లక్షలు సీజ్ చేసింది. వీటి వివరాలను ఈడీ సేకరించనుంది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనీలాండరింగ్పై సమాచారం రాబట్టనుంది. న్యూజిలాండ్లోని రాజశేఖర్రెడ్డి బావ ప్రశాంత్రెడ్డికి ఎనీడెస్క్ యాప్ ద్వారా గ్రూప్1 పేపర్ పంపించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్రెడ్డి ద్వారా విదేశాల్లో ఉన్న ఇంకెవరికైనా పేపర్ షేర్ అయ్యిందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. వారి నుంచి ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి ఖాతాలకు కానీ, ఇతరుల ద్వారా కానీ మనీ ట్రాన్స్ఫర్ జరిగిందా అనే వివరాలను రాబట్టనుంది. నిందితుల బ్యాంక్ అకౌంట్స్, వాటిలో నమోదైన డిపాజిట్స్ గురించిన సమాచారం కోసం సంబంధిత బ్యాంకులకు ఈడీ లెటర్స్ రాయనుంది.