ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీట్ దాఖలు 

ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీట్ దాఖలు 

ఆరేళ్ల క్రితం సంచలనం  సృష్టించిన ఓటుకు నోటు కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా ఇవాళ(గురువారం) ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొన్న ఈడీ..కేసులో మొదటిసారిగా టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కీర్తన్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చింది. వీరితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ తదితరులను నిందితులుగా చేర్చింది.

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. 

గురువారం దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ.. చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. టీడీపీ అభ్యర్థిగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన ఆరోపణ.