
ఫాల్కన్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ స్కాంలో రూ. 791 కోట్లు మోసం చేసినట్లు గుర్తించింది ఈడీ. యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు రాబట్టినట్లు చార్జిషీట్లో పేర్కొంది ఈడీ. ఈ స్కాములో దేశవ్యాప్తంగా రూ. 3 వేల కోట్ల మోసాలు జరిగినట్లు తెలిపింది ఈడీ. వసూలు చేసిన డబ్బుతో నిందితులు సొంత ఆస్తులు, ఛార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది ఈడీ. రియల్ ఎస్టేట్ లో పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది ఈడీ.
ఫాల్కన్ కేసు వెలుగులోకి రావడంతో ఛార్టర్డ్ ఫ్లైట్లో పారిపోయిన నిందితుడు అమర్దీప్ ను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈడీ.ఇప్పటికే ఛార్టర్డ్ ఫ్లైట్తో పాటు 100 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది ఈడీ. ఫాల్కన్ స్కామ్లో వచ్చిన డబ్బులతోనే రూ. 14 కోట్లు పెట్టి చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కంపెనీ చైర్మన్ అమర్ దీప్ మరి కొంతమంది కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు.
అసలు ఈ ఫాల్కన్ స్కామ్ కేసు ఏంటి..?
హైదరాబాద్లోని హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ నిర్వహించేది. అమర్ దీప్ కుమార్ డైరెక్టర్గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ కలిసి పోన్జీ స్కీమ్ పేరుతో 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆన్లైన్ మార్కెటింగ్ కోసం మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్లను రూపొందించారు. ఫ్యాబ్రికేటెడ్ ప్రొఫైల్స్తో బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ సహా పలు ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వెండర్స్గా ప్రొఫైల్స్ తయారు చేశారు. వీటితో ఆన్లైన్లో ప్రకటనలు చేశారు.
తమ వద్ద ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఏటా11 శాతం నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు. ఇలా నాలుగేండ్ల పాటు 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారు. వారికి తిరిగి చెల్లించాల్సిన మరో రూ.850 కోట్లను 14 రకాల షెల్ కంపెనీల అకౌంట్లకు మళ్లించారు.