అశోక్ గెహ్లోత్ సోదరుడి ఆస్తులపై ఈడీ దాడులు

అశోక్ గెహ్లోత్ సోదరుడి ఆస్తులపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్‌ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఫెర్టిలైజర్‌‌ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్‌లో అగ్రసేన్‌కు లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది. దేశ వ్యాప్త దాడుల్లో భాగంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈడీ దాడులు చేసింది. రాజస్థాన్‌లో ఆరు ప్లేస్‌లతోపాటు గుజరాత్‌లో నాలుగు చోట్ల, బెంగాల్‌లో రెండు ప్రాంతాల్లో, ఢిల్లీలో ఓ లొకేషన్‌లో దాడులకు దిగినట్లు సమాచారం.

అగ్రసేన్ గెహ్లోత్‌కు చెందిన జోధ్‌పూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనుపమ్ కృషిలో ఈడీ రెయిడ్ చేపట్టింది. ప్లాంట్ గ్రోత్‌, క్వాలిటీలో కీలకంగా భావించే పొటాష్‌ లేదా ఎంఓపీ సీలింగ్‌లో అగ్రసేన్‌పై నిందితుడిగా ఉన్నారు. విదేశీ కంపెనీల ఆధారంగా సబ్సిడీ ధరకే ఆయన ఎంఓపీని దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరంపై 2007 నుంచి 2009 మధ్య అగ్రసేన్‌ మీద ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. తక్కువ ధరకు దక్కించుకున్న ఎంఓపీని అగ్రసేన్ మలేసియా, సింగపూర్ కంపెనీలకు ఇండస్ట్రీయల్ సాల్ట్‌గా అమ్మారని ఈడీ అధికారులు తెలిపారు. అక్రమంగా సబ్సిడీ కింద ఎంఓపీని దక్కించుకున్నందుకు ప్రభుత్వానికి రూ.60 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.