
- రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్,విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి జారీ
- 23న రానా, 30న ప్రకాశ్రాజ్, ఆగస్టు 6న విజయ్,
- 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఆదేశం
- ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేసిన 29 మందిపై
- ఈసీఐఆర్ నమోదు.. సెలబ్రిటీల ప్రమోషన్స్ను
- సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన బెట్టింగ్ గ్యాంగ్స్
- మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు షురూ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మికి సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న రానా దగ్గుబాటి, 30న ప్రకాశ్రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
పాన్కార్డుసహా బ్యాంక్ లావాదేవీలు, లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరుకావాలని సూచించింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు, సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలోనే విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది.
సెలబ్రిటీలందరూ విచారణకు రావాల్సిందే
ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, ఏ23, జీత్విన్, పరిమ్యాచ్, లోటస్ 365 సహా ఇతర ప్లాట్ఫామ్లను 29 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్రాజన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయాని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రీత, మేనేజ్మెంట్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ కిరణ్గౌడ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు అజయ్, సన్నీ, సుధీర్, యూట్యూబర్ లోకల్ బాయ్ నాని.. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు.
వీరందరికీ ఆయా యాప్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. సెలబ్రిటీలు చేసుకున్న అగ్రిమెంట్లు సహా యాప్స్ కంపెనీల నుంచి సెలబ్రిటీల అకౌంట్లతో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.
ఢిల్లీ, కోల్కతా, బెంగళూర్ నుంచి..
యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ, కోల్కతా, బెంగళూరుకు చెందిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలుసహా ప్రముఖ యాంకర్లతో ప్రమోషన్ చేయించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బెట్టింగ్ యాప్స్లో వచ్చే డిపాజిట్లపై ఇన్సెంటివ్, లాస్ పేమెంట్పై బోనస్ అంటూ చైన్ సిస్టమ్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా సెలబ్రిటీలు ప్రమోషన్లు చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఎ
క్కువ మందిని బెట్టింగ్ గ్రూపుల్లో జాయిన్ చేసే ఇన్ఫ్ల్యూయెన్సర్గా కంటెంట్, ఫొటోలు అప్లోడ్ చేయించడం ద్వారా సెలబ్రిటీలకు కమీషన్లు సహా ఒక్కసారి ప్రమోషన్కు ప్రతి రోజు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నదని దర్యాప్తులో వెల్లడైంది. వీరందరినీ విచారించేందుకు ఈడీ షెడ్యూల్ ఖరారు చేసింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 23న రానా దగ్గుబాటితో విచారణ ప్రారంభించనున్నది. 29 మందిని విచారించనున్నది. బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి వీరి అకౌంట్లలో ఎంత డబ్బు డిపాజిట్ అయ్యిందనే వివరాలు కూడా రాబట్టనున్నది.