
జాతీయ విద్యావిధానంలో ప్రమాణాలతో కూడిన ఆధునికమైన, నాణ్యమైన విద్యను అందిస్తామని ‘మోదీకి గ్యారెంటీ’ పేరుతో బీజేపీ విడుదల చేసిన ‘సంకల్ప పత్ర’లో వాగ్దానం చేశారు. అద్భుతమైన పాఠ్యప్రణాళిక ప్రక్రియ, ఉపాధ్యాయ శిక్షణ, మౌలిక వసతుల కల్పన, సాంకేతిక అంశాలను వినియోగిస్తూ జ్ఞాన నైపుణ్యాలను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు.
అంతేకాకుండా జాతీయ విద్యా విధానంలో చెప్పిన విధంగా అత్యుత్తమ పాఠశాల విద్య అందించడానికి పీఎం శ్రీ, ఏకలవ్య పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, 100% నమోదుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ సూత్రాలు, విద్యాహక్కు చట్టం ప్రకారం అంతరాలు లేకుండా నాణ్యమైన విద్య ప్రజలందరికీ అందించాలి.
మోదీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ చూస్తే విద్య లేకుండానే ‘సేవా, సుహాసన్, గరీబ్ కల్యాణ్ కీ వికసిత భారత్’ సాధనకు కృషి జరుగుతున్నట్లు అనిపిస్తోంది. 2013–-14 కేంద్ర బడ్జెట్లో ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 4.77శాతం నిధులు కేటాయిస్తే, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-–15లో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో విద్యకు కేటాయించిన బడ్జెట్ పరిమాణం 4.61 శాతానికి తగ్గింది. ఈ తగ్గుదల 11 ఏళ్ళ నుంచి ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు 2025-–26 సంవత్సరానికి విద్యకు కేటాయించిన బడ్జెట్ 2.53 శాతానికి తగ్గింది. ఈ తక్కువ వ్యయం విద్యా నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ 11 ఏళ్ల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలు 14.9% పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలలు 8 శాతం తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలు 89,441 తగ్గగా, ప్రైవేట్ పాఠశాలలు 4,294 పెరిగాయి.
ప్రభుత్వ బడులు మూసివేత
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో 29,410 ప్రభుత్వ పాఠశాలలు, ఉత్తర ప్రదేశ్ లో 25,126 పాఠశాలలు మూతపడ్డాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల పెరుగుదల 44.9% గా ఉంది. మధ్యప్రదేశ్ లో 24.1%, జమ్మూ కాశ్మీర్ లో 21.4%, ఒడిశాలో 17.1%, అరుణాచల్ ప్రదేశ్ లో 16.4%, ఉత్తర ప్రదేశ్ లో 15.5%, ఝార్ఖండ్ లో 13.4%, నాగాలాండ్ లో 14.4% ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫామింగ్ హ్యూమన్ కేపిటల్) నివేదిక తెలిపింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే 2-5 లక్షలమంది ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేదు. దానివల్ల విద్యాహక్కు చట్టం లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నామని పేర్కొంది.
7,400 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ నేరుగా నిర్వహించే 1,256 కేంద్రీయ విద్యాలయల్లో 13.56 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో 7,400 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత సంవత్సరం కేంద్రీయ విద్యాలయాలకు 9,302 కోట్లు కేటాయిస్తే, తాజాగా 8,727 కోట్లకు తగ్గింది.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 4,022 ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. ఈ పాఠశాలకు గత బడ్జెట్లో రూ. 5800కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ. 5305 కోట్లకు తగ్గించారు. 2020 సంవత్సరంలో మోదీ ప్రభుత్వం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు పేరుతో 728 పాఠశాలలను గిరిజన పిల్లల కోసం ప్రారంభించింది. అయితే, వీటిలో 477 పాఠశాలలు మాత్రమే పనిచేస్తున్నాయి.
నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే 14,500 పాఠశాలలను పీఎంశ్రీ పాఠశాలలుగా ఎంపిక చేశారు. 2022లో ఈ పథకానికి శ్రీకారం చుడుతూ ఐదేళ్ల కాలంలో రూ. 27,360 కోట్ల వ్యయం అంచనా వేశారు. అందులో కేంద్రం 18,128 కోట్లు, రాష్ట్రాలు 9,232 కోట్లు భరించాలి. సగం కాలం ఇప్పటికే పూర్తయినప్పటికీ మూడోవంతు మాత్రమే అంచనా వేసిన మొత్తంలో ఖర్చు చేశారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత
గుజరాత్ ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరుతో 5,223 స్కూళ్లను మూసివేస్తున్నట్లు 2000వ సంవత్సరంలో ప్రకటించింది. 1,606 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. అంటే ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తున్నారు. ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు అవసరం. అయితే, ఆమేరకు నిధుల కేటాయింపు జరగడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో భారతీయ యూనివర్సిటీలు మూడు మాత్రమే ఉన్నాయి. దీనకంతటికీ కారణం సరైన నిధుల కేటాయింపులేకపోవడమే. వాస్తవానికి కొఠారి కమిషన్ ఆరుశాతం స్థూల జాతీయ ఆదాయాన్ని విద్యా రంగానికి కేటాయించాలని సూచించింది. ఆ రకంగా విద్యా బడ్జెట్ను పెంచి, నాణ్యమైన విద్యనందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యావ్యవస్థ అభివృద్ధి చెందాలంటే, ప్రజలు,విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ సమష్టిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
ఉన్నత విద్యా సంస్థలలో ప్రమాణాల పెంపుకోసం 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) పథకానికి పూర్తి స్థాయిలో నిధులు అందకపోవడంతో ఆశించిన ఫలితాలు పొందలేకపోతోంది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఎనిమిది విద్యాసంస్థలకు 2018-–19 నుంచి ఏడు ఆర్థిక సంవత్సరాలలో వెయ్యి కోట్ల రూపాయల చొప్పున సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నిలుపుకోవడంలో విఫలమైంది.
2021 ఫిబ్రవరి నుంచి పథకం అమలును పర్యవేక్షించేందుకు విద్యాశాఖ కనీసం సాధికారత నిపుణుల కమిటీని పునర్నిర్మించలేకపోయింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటిలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్ లు, కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో 56.18 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. 2021లో ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 46 శాతానికే ఉద్యోగాలు దక్కాయి.
-కె. వేణుగోపాల్, ఎడ్యుకేషన్ ఎనలిస్ట్-