విద్యారంగానికి బడ్జెట్​ పెంచాలి

విద్యారంగానికి  బడ్జెట్​ పెంచాలి

ప్రజల జీవన ప్రమాణాలు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు వారికి అందించే విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు నేటి పాలకులు గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రఖ్యాత అమెరికా సంస్థ BAV గ్రూప్,  వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ  తయారుచేసిన వార్షిక నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యను అందించడంలో అమెరికా, ఇంగ్లాండ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారతదేశం 32వ స్థానంలో ఉంది. ఈ సర్వేను 78 దేశాల్లో  వేల మంది ప్రజలతో ఈ సంస్థ నిర్వహించడం విశేషం. 26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అతిపెద్ద విద్యావ్యవస్థలో ఉన్న మనం విద్యారంగంలో అనేక విద్యాసంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో సఫలీకృతం కాలేకపోయాం.

ప్రతి బడ్జెట్​లో 6% నిధులు కేటాయించాలి

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్  ప్రకారం భారతదేశంలో నాణ్యమైన విద్య అందించకపోవడానికి ప్రధాన కారణాలుగా విద్యారంగానికి సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, దేశంలో 33 శాతం టీచర్లు అర్హత కలిగిన వారు అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు టీచర్లు అందిపుచ్చుకోకపోవడం, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా వారిలో సృజనాత్మకతను పెంచేలా కరికులం లేకపోవడం, దేశంలోని మెజారిటీ బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడానికి మూల కారణం బడ్జెట్ లో  విద్యారంగానికి నిధులు అధికంగా కేటాయించకపోవడం.21వ శతాబ్దంలో భారతీయ యువత ప్రపంచంతో పోటీ పడాలని వారికి నాణ్యమైన విద్యను అందించాలని, వారిలో సృజనాత్మకతను పెంచాలని భారత ప్రభుత్వం 29 జూలై 2020 రోజున నూతన జాతీయ విద్యా విధానం–2020 ను తీసుకొచ్చింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం భారతదేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం 6% నిధులను కేటాయించాలి.

విద్యలో మనమెక్కడ?

గత  ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ బడ్జెట్ లో  కేవలం 2.9% నిధులు (1,12,899 కోట్లు) మాత్రమే కేటాయించింది. ప్రపంచంలో నాణ్యమైన విద్యను అందించే దేశాలు వాటి బడ్జెట్​లో  6 % కన్నా ఎక్కువ నిధులనే కేటాయిస్తున్నాయి. ఉదాహరణకి నార్వే, చిలి దేశాల్లో 6.6%, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ 6.2%  ఇంగ్లాండ్ 6.1%  అమెరికా 6% నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.

నాణ్యమైన విద్య కోసం విదేశాలకు..

భారత ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం నుంచి ఉన్నత చదువులకు వివిధ దేశాలకు వెళ్తున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే 2023వ సంవత్సరంలో 68% పెరుగుదలతో 7,50,365 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు తరలి వెళ్లారు. ఒక సర్వే ప్రకారం ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరంలో భారతదేశం నుంచి 1.8 మిలియన్ల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం వేరే దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. దేశంలో ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా విద్యార్థులు వేరే దేశాలకు వెళ్తున్నారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా పాలకులు రాబోయే బడ్జెట్​లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తారని ఆశిద్దాం.

- పాకాల శంకర్ గౌడ్, విద్యావేత్త