- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
- ఎస్ఎల్బీసీని త్వరలోనే పూర్తి చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
దేవరకొండ, వెలుగు : కాంగ్రెస్ పాలనలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని కోలుముంతల్పహాడ్ రైతు వేదిక వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి రూ.23 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు గుర్తు చేశారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో దేవరకొండకు తాగు, సాగు నీటి సౌకర్యానికి కృషి చేశానని, ఎస్ఎల్బీసీ, పెండ్లి పాకల రిజర్వాయర్, నక్కలగండి, డిండి ప్రాజక్ట్ కింద చింతపల్లి, గోపనపల్లి రిజర్వాయర్లు, 18 కిలోమీటర్ల లింక్ కెనాల్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటి ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. డిండి ప్రాజెక్ట్ పూర్తి అయితే రెండేండ్లలో దేవరకొండ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో దేవరకొండ, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు జమునామాధవరెడ్డి, అలివేలు సంజీవరెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, డీఈవో బిక్షపతి పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలి : మంత్రి వెంకట్రెడ్డి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సంవత్సరంలోగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. పేమెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, నల్గొండలో నిర్మిస్తున్న స్కూల్కు ఇప్పటివరకు రూ.20 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ స్కూల్తో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సైతం ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా స్టూడెంట్లకు బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
కాగా, వాహనాల రిజిస్ట్రేషన్కు మిర్యాలగూడ, నల్గొండ వెళ్లాల్సి వస్తోందని, కొండమల్లేపల్లిలో ఆర్టీవో ఆఫీస్ ఏర్పాటు చేయాలని, దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలను మెరుగుపరచాలని, నేరేడేగొమ్ములో 132 కేవీ సబ్స్టేషన్ నిర్మించాలని ఎమ్మెల్యే బాలునాయక్ కోరడంతో స్పందించిన మంత్రి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

