మహబూబ్నగర్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామస్తులు గోస పడుతున్నరు. ఐరన్ కంపెనీల నుంచి వచ్చే పొగ, దుమ్ముకారణంగా ఊపిరితిత్తులు, శ్యాసకోశ జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీని బంద్ చేయించాలని కలెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లకు వేడుకుంటున్నా ఎవరూ స్పందించడం లేదు. ఈ కంపెనీలకు దగ్గర్లోనే కస్తూర్బా, గురుకుల స్కూళ్లు ఉండటంతో స్టూడెంట్లు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో గ్రామస్తులు కంపెనీని మూసివేయాలని వారం రోజులుగా ధర్నా చేస్తున్నారు.
1600 జనాభాపై ఎఫెక్ట్
గుండేడ్ గ్రామంలో1,600 జనాభా ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకొని 2003లో అప్పటి సర్కారు రెండు ఐరన్ కంపెనీలు ఏర్పాటు చేసింది. ఈ కంపెనీల్లో ఇనుముకు సంబంధించిన ముడి సరుకును తయారు చేస్తుండడంతో వాయు కాలుష్యం వెలువడుతోంది. ఇనుమును కాల్చడం వల్ల వచ్చే పొగను ఉదయం, సాయంత్రం పూట బయటకు వదులుతున్నారు. ఇందులో ఐరన్ డస్ట్ కూడా కలుస్తుండటంతో ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువగా వైరల్ ఫీవర్స్, శ్యాసకోశ సంబంధిత వ్యాధులు, మోకాళ్లు నొప్పులు, కడుపులో మంట, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్నారు. ఏడాదిలో ఇప్పటికే ఇద్దరు ఊపిరితిత్తుల వ్యాధితో మృతి చెందారు. పశువులు కూడా వింత రోగాలతో చనిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితం అయ్యి పంటలు పండటం లేదని వాపోతున్నారు. పొగ, బూడిద పంటల మీద పడుతుండడంతో పనికి రాకుండా పోతున్నాయి. దీంతో చేసేది లేక భూములను పడావు పెడుతున్నామని రైతులు చెబుతున్నారు.
500 మీటర్ల దూరంలోనే గురుకులం
ఈ కంపెనీకి 500 మీటర్ల దూరంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఉంది. ఇందులో దాదాపు 600 మంది గర్ల్స్, బాయ్స్ చదువుకుంటున్నారు. కంపెనీ నుంచి పొగను వదిలిన ప్రతిసారి ఈ గురుకులం మీద డస్ట్ పడుతుండడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. వారం కిందట ఓ స్టూడెంట్కు శ్యాస ఆడక ఇబ్బంది పడటంతో, మహబూబ్నగర్ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడు. అలాగే కిలోమీటరున్నర దూరంలో ఉన్న చెనంగ్లగడ్డ తండా వద్ద ఉన్న కస్తూర్బాలో 380 మంది చదువుకుంటున్నారు. వీళ్లు పరిస్థితి కూడా గురుకులం మాదిరిగానే ఉంది.
కంపెనీ చుట్టూ రాజకీయం
ఈ కంపెనీని బంద్ చేయాలని గ్రామస్తులు 2009 నుంచి డిమాండ్ చేస్తూనున్నారు. కానీ, ఈ గ్రామ పంచాయతీకి చెందిన కొందరు పొలిటికల్ లీడర్లు మాత్రం ప్రజల ఆందోళనను క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజలు కంపెనీ వద్దకు వచ్చి ఆందోళన చేసిన ప్రతిసారి ఈ లీడర్లు యాజమాన్యాలతో చేతులు కలుపుతున్నారు. వారిచ్చే డబ్బుకు ఆశపడి ప్రజల ఆందోళనను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీని 2009లో, 2012, 2015, 2019 కొద్ది రోజుల పాటు బంద్ చేశారు. కరోనా టైంలో పూర్తిగా బంద్లో ఉండగా, ఏడాది కిందట తిరిగి ప్రారంభించారు. నిరుడు మార్చిలో తెరవొద్దని ప్రజలు ఆందోళన చేయగా, బంద్ చేస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. నాలుగు నెలలు కావస్తున్నా బంద్ చేయకపోవడంతో గత శుక్ర, శనివారాల్లో కంపెనీ ఎదుట టెంట్లు వేసుకొని ధర్నా చేశారు. కంపెనీ యాజమాన్యానికి 15 రోజుల డెడ్లైన్ విధించి వెళ్లిపోయారు.
బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నయి
మా గురుకులకు 500 మీటర్ల దూరంలో ఐరన్ కంపెనీ ఉంది. ఈ మధ్య విపరీతమైన పొల్యూషన్ వస్తుండడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నరు. శ్వాసకోశ ఇబ్బందులు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీసెంట్గా ఓ స్టూడెంట్కు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడంతో మహబూబ్నగర్హాస్పిటల్లో చేర్పించం.
- వి.లక్ష్మారెడ్డి, ఏకలవ్య గురుకుల ప్రిన్సిపాల్, బాలానగర్
బంద్ చేస్తమన్నరు.. మళ్లా తెరిచిండ్రు
నిరుడు మార్చిలో కంపెనీని బంద్ చేయాలని ఊరోళ్లమంతా కలిసి ధర్నా చేసినం. రెండు నెలల్లో బంద్ చేస్తామని చెప్పిండ్రు. కానీ, ఐదు నెలలైతుంది. ఇంత వరకు బంద్చేస్తలేరు. ఈ మధ్య పొగ నిరుడు కంటే ఎక్కువగా వస్తున్నది. దాని వల్ల మాకు రోగాలు వస్తున్నయి.
- లత, గుండేడ్ గ్రా మం
ఇండ్లు, పంటలపై పొగ
రోజూ ఉదయం, రాత్రి కంపెనీ నుంచి పొగ ఇడుస్తుండ్రు. ఆ బూడిద అంతా మా ఇండ్ల మీద పడుతోంది. మిద్దె మీద బట్టలు ఆరేసుకుంటే నల్లగా అయి తున్నయి. పంటలైతే పనికిరాకుండా పోతున్నయి. ఎన్నిసార్లు ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా మా ఊరి వైపే చూస్తలేరు.
- అమృత, గుండేడ్ గ్రామం