
భోపాల్: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్తనే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే తాను, స్మృతి మందాన పెళ్లి చేసుకోబోతున్నామని అఫిషియల్గా ప్రకటించాడు.
కాగా, స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ రిలేషన్ షిప్లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తమ బంధాన్ని స్మృతి కానీ పలాష్ కానీ అధికారికంగా ఎప్పుడు ధృవీకరించలేదు. ఈ క్రమంలో స్మృతి మందానతో రిలేషన్ షిప్, పెళ్లి గురించి తొలిసారి అఫిషియల్గా కన్ఫామ్ చేశాడు పలాష్ ముచ్చల్. స్మృతి తాను రిలేషన్లో ఉన్నది వాస్తవమేనని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని కుండబద్దలు కొట్టాడు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పలాష్ ముచ్చల్ ఆదివారం (అక్టోబర్ 19) స్టేట్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్మృతితో రిలేషన్ షిప్ గురించి పలాష్కు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు పలాష్ సమాధానమిస్తూ.. ‘‘స్మృతి మందాన త్వరలో ఇండోర్కు కోడలు అవుతుంది.. నేను చెప్పదలచుకున్నది ఇంతే’’ అని ఫస్ట్ టైమ్ తమ రిలేషన్ షిప్ గురించి నోరువిప్పాడు. పలాష్ ముచ్చల్ ప్రకటనతో స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని విషయం స్పష్టమైంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్తో స్మృతి బిజీ బిజీగా గడుపుతోంది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 19) ఇండోర్లోని హోల్కర్ స్టేడియం ఇంగ్లాండ్, ఇండియా తలపడనున్నాయి. ఈ మ్యాచుకు ముందు తన స్వస్థలం ఇండోర్లో మ్యాచ్ ఆడబోతున్న స్మృతికి పలాష్ శుభాకాంక్షలు తెలిపారు.