
ఖమ్మం జిల్లాలో ఆదివారం 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లి మండలంలో కరోనా పాజిటివ్ రోగి కుటుంబంలోని ముగ్గురికి, అతని షాప్ లో పనిచేసే ఐదుగురికి మొత్తం 8మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
పాజిటివ్ కేసులు నమోదైనప్పటికి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రతి ఒక్కరూ హోమ్ క్వారంటైన్ పాటించాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపింది.