దేశవ్యాప్తంగా రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 20 వేల ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీలు) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఈవీఐ టెక్నాలజీస్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నిధులతో ఏర్పాటైన ఎలక్ట్రోప్రిన్యూర్ పార్క్లో ఇది యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఒక్క ఢిల్లీలోనే మూడువేల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ తో ఒప్పం దం కుదుర్చుకుంది. ఇళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఈవీఐ టెక్నాలజీస్ సీఈఓ రూపేశ్ కుమార్ చెప్పారు.
ఆర్థిక వనరుల కోసం కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, లీజింగ్ మోడల్ కు రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.ఐదు కోట్లు సమకూర్చు కోవడానికి ప్రయత్నిస్తున్నామని కుమార్ వివరించారు. ఈ కంపెనీ ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని 16 లొకేషన్లలో సేవలు అందిస్తోంది. 2017 జూన్ లో మొదలైన ఈవీఐ టెక్నాలజీస్ ప్రైవేటు వ్యక్తులకు చార్జింగ్ స్టేషన్లకు లీజుకు ఇస్తోంది. ఢిల్లీలో ఒక్కో ఈవీ ఏర్పాటు కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేస్తోంది. ఈ కంపెనీ చార్జింగ్ స్టేషన్లను నిర్మించి లీజుకు ఇవ్వడం వరకే పరిమితమవుతుంది. వీటికి ఇచ్చే కరెంట్ యూనిట్ కు రూ.ఐదు చొప్పున రాజధాని పవర్ వసూలు చేస్తుంది.

