కేబుల్స్ తొలగిస్తుండగా కరెంట్ షాక్.. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లలో భాగంగా ఘటన

కేబుల్స్ తొలగిస్తుండగా కరెంట్ షాక్.. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లలో భాగంగా ఘటన

గచ్చిబౌలి, వెలుగు: మిస్​వరల్డ్ పోటీల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది.  హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెయిన్​రోడ్డు వెంట అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్స్ ను తొలగిస్తుండగా ఓ యువకుడికి కరెంట్​షాక్​ తగిలింది. దీంతో అతని శరీరం 40 శాతం కాలి పోయింది.  పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం రుంకు హనుమంతపురానికి చెందిన వై.

ఉపేందర్(23) కొంతకాలంగా సిటీలోని మూసాపేట పరిధి ప్రగతినగర్​కాలనీలో ఉంటున్నాడు. మూడేండ్లుగా టీజీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్, ఎలక్ట్రికల్​ వర్కర్ గా  పని చేస్తున్నాడు.   హైదరాబాద్​ వేదికగా జరగనున్న మిస్​ వరల్డ్​ పోటీలకు అన్ని శాఖల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్​ ఉన్నతాధికారులు మెయిన్​రోడ్ల వెంట అస్తవ్యస్తంగా ఉన్న  ఇంటర్నెట్, కరెంట్, టెలిఫోన్​వైర్లను తొలగించాలని ఆదేశించారు. 

శుక్రవారం మధ్యా హ్నం గచ్చిబౌలి ఫ్లై ఓవర్​ సమీపంలోని జీప్​ షోరూం వద్ద విద్యుత్ కాంట్రాక్టర్ తన సిబ్బందితో  కేబుల్స్​ తొలగింపు చేపట్టారు. ఉపేందర్ ఆ పనిలో ఉండగా కరెంట్​ షాక్​కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన​అతడిని తోటి కార్మికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉపేందర్​రెండు చేతులు, తల, కుడి కాలికి 40 శాతం గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.