
- ఇందులో సగం వాటా మొబైల్ ఫోన్లదే
న్యూఢిల్లీ: ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం పెరిగి రూ. 1.6 లక్షల కోట్లకు చేరతాయని, ఇందులో సగం మొబైల్ ఫోన్ల ఎగుమతులే ఉంటాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వెల్లడించింది. 2021–22 లో మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1,16,937 కోట్లని పేర్కొంది. 2021–22లో రూ. 45 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు జరగ్గా, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అవి రూ. 75 వేల కోట్లకు మించుతాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఈఏ తెలిపింది.
డిసెంబర్ 2022 దాకా 9 నెలల కాలానికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1,33,313 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వల్లే ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరుగుతున్నట్లు వివరించింది. ఏప్రిల్– డిసెంబర్ 2022 మధ్య కాలంలో అనుకున్న విధంగానే మొబైల్ ఫోన్ల ఎగుమతులు పెరిగాయని, దీంతో టార్గెట్ 9–10 బిలియన్ డాలర్లను అందుకోగలమనే నమ్మకం కలుగుతోందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ చెప్పారు.