- పుప్పాలగూడ చెరువుపై అక్రమ నిర్మాణాలు తొలగించండి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలో శంకర్నగర్ వద్ద మూసీ నది పూడ్చివేతను వెంటనే ఆపాలని, పుప్పాలగూడ చెరువుపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. చెరువు స్థలాన్ని ప్రైడ్ హోండా అండ్ హైరేజస్ ఆక్రమించిందని, ఇప్పుడు అక్కడ చెరువు కనిపించడం లేదని సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా సార్వవత్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించి ఇటీవల విచారించింది. చెరువు, మూసీనది వద్ద ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. అమికస్క్యూరీగా లాయర్ కె.పవన్కుమార్ను నియమించింది. ‘ఆరేండ్లుగా మూసీనదిని పూడ్చివేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. పుప్పాలగూడ చెరువు మాయమైంది. హైకోర్టు జోక్యం చేసుకుని వాటిని రక్షించాలి’’ అని తన లేఖలో లుబ్నా సార్వవత్ కోరారు. రిపోర్ట్ అందజేసేందుకు టైం కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోరడంతో హైకోర్టు అనుమతించింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.