
- వీలున్నంత తొందరగా ఎంటర్ అవుతాం
- మోడీ గ్రేట్ లీడర్..ఇన్వెస్ట్ చేసేంత వరకు వదలడం లేదు
- సోలార్ ఎనర్జీలో బోలెడు అవకాశాలు..
- స్టార్లింక్తో మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్
న్యూఢిల్లీ: ఇండియాలోకి టెస్లా ఎంటర్ అవుతుందని, అది కూడా వీలున్నంత తొందరగా జరుగుతుందని టెస్లా బాస్ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని ఆయన కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టడంపై ఈ మీటింగ్లో మాట్లాడారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. పెద్ద దేశాల్లో ఇండియా మంచి పొజిషన్లో ఉందని, ఈ దేశ భవిష్యత్పై పాజిటివ్గా ఉన్నానని అన్నారు. ‘ఇండియన్ మార్కెట్లోకి టెస్లా ఎంటర్ అవుతుంది. వచ్చే ఏడాది ఇండియాలో పర్యటించే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. ప్రధాని మోడీ సపోర్ట్కు థ్యాంక్స్ చెప్పారు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందన్నారు. తొందరపడి అనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకోవడం లేదని, కానీ, ఇండియాతో బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో ఈ అనౌన్స్మెంట్ కీలకమవుతుందని వివరించారు.
ట్విట్టర్.. రూల్స్ ఫాలో కావాల్సిందే
ట్విట్టర్ లోకల్ గవర్న్మెంట్ రూల్స్ను కచ్చితంగా ఫాలో కావాల్సిందేనని, తమకు వేరే ఛాయిస్ లేదని ఎలన్ మస్క్ అన్నారు. లేకపోతే మూసేసుకోవాల్సిందేనని చెప్పారు. రైతుల నిరసనలు జరిగినప్పుడు వీటిని కవర్ చేస్తున్న చాలా అకౌంట్లను బ్లాక్ చేయాలని ఇండియన్ గవర్న్మెంట్ నుంచి ఒత్తిళ్లు వచ్చాయని కంపెనీ మాజీ సీఈఓ జాక్ డోర్సే ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై మస్క్ స్పందించారు. ఏ దేశంలోనైనా లోకల్ రూల్స్కు తగ్గట్టు, వీలున్నంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అందించాలని చూస్తున్నామని అన్నారు. లోకల్ రూల్స్కు విరుద్ధంగా తాము పనిచేయడం అసాధ్యమని పేర్కొన్నారు.
ఇతర ప్రముఖులు...
ఈ నెల 21 నుంచి 24 వరకు యూఎస్లో పర్యటిస్తున్న మోడీ, మస్క్తో పాటు ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ డిగ్రాస్ టైసన్, నోబెల్ గ్రహిత, ఎకానమిస్ట్ పాల్ రొమెర్, రచయిత నికోలస్ నాసిమ్ తాలెబ్, ఇన్వెస్టర్ రే డాలియోని కూడా కలిశారు. ఇందులో కొంత మందితో ముఖాముఖిగా సమావేశం కాగా, మరికొంత మందిని గ్రూప్లో కలిశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇండియా చాలా సమర్ధవంతంగా పనిచేసిందని నాసిమ్ తాలెబ్ ట్వీట్ చేశారు. ఇండియాలో బోలెడు అవకాశాలు ఉన్నాయని, దేశాన్ని మార్చే సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడని డాలియో ట్వీట్ చేశారు. ఇండియా, మోడీ కలిసి చాలా అవకాశాలను క్రియేట్ చేశారని అన్నారు. ఆయనకు ఆకాశం కూడా హద్దు కాదని టైసన్ వీడియో స్టేట్మెంట్లో పేర్కొన్నారు. సైన్స్పై ఆయనకు నాలెడ్జ్ ఉందని అన్నారు. ‘చాలా మంది వరల్డ్ లీడర్లకు ప్రయారిటీలను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. కానీ, పరిష్కారాలతో సహా మోడీ చాలా విషయాలను పట్టించుకుంటారు’ అని కొనియాడారు. కాగా, వీరి ట్వీట్స్కు మోడీ రిప్లై కూడా ఇచ్చారు.
నేనూ మోడీ అభిమానినే..
మోడీకి ఇండియా అంటే చాలా ఇష్టమని, తాము పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేస్తున్నారని మస్క్ పేర్కొన్నారు. తాను మోడీ ఫ్యాన్ అని అన్నారు. సోలార్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో బోలెడు అవకాశాలు ఉన్నాయన్నారు. ఇండియాకు మేలు చేసేలా మోడీ చర్యలు తీసుకుంటున్నారని, ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలంగా మారుస్తున్నారని అన్నారు. కంపెనీలకు సపోర్ట్ ఇస్తూనే ఇండియా అడ్వాన్స్ అవ్వాలని చూస్తున్నారని వివరించారు. సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్కు ఇండియా గ్రేట్ ప్లేస్ అని మస్క్ అన్నారు. ఇండియా ల్యాండ్ ఏరియాలో కేవలం ఒకటి లేదా రెండు శాతంలోనే ఈ గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతోందని చెప్పారు. స్టార్లింక్తో మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సర్వీస్లను అందిస్తామని పేర్కొన్నారు. ఎలన్ మస్క్తో మీటింగ్ బాగా జరిగిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎనర్జీ నుంచి అధ్యాత్మికం వరకు మనం వివిధ అంశాలపై చర్చించుకున్నామని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని మళ్లీ కలవడం గౌరవంగా భావిస్తున్నా’నని మోడీ ట్వీట్కు మస్క్ రిప్లై ఇచ్చారు.