
- 12 వరకు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్
- 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
- 8 నుంచి 15 దాకా వెబ్ ఆప్షన్లు..19న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2024-–25 విద్యాసంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి నేటి నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. ఈ నెల 4 నుంచి 12 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్తో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 6 నుంచి 12 వరకు తొలి విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఈ నెల 8 నుంచి 15 దాకా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 19న సీట్లు కేటాయిస్తారు.
కొత్త సీట్లపై నో క్లారిటీ..
రాష్ట్రవ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీలుండగా.. వీటిలో నిరుడు1.17 లక్షల సీట్లు భర్తీ చేశారు. వీటిలో 17 సర్కారు కాలేజీలు ఉండగా, 5,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సీట్లన్నీ 161 ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70% సీట్లను మాత్రమే కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనుండగా, మిగిలిన 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద నింపుతారు. నిరుడు మొత్తం కన్వీనర్ కోటా కింద 86 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే, ఇప్పటివరకు ఇంకా కొత్త సీట్లపై క్లారిటీ రాలేదు. వెబ్ ఆప్షన్లకు మరో 4 రోజులు గడువు ఉండటంతో, అప్పటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులివ్వడంతో, ఆయా కాలేజీలను కౌన్సెలింగ్కు అనుమతించనున్నారు. కొత్తగా ఈ ఏడాది ప్రైవేట్ కాలేజీల్లో 20 వేల సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. మరో 9 వేల సీట్లను కాలేజీలు మేనేజ్మెంట్ కోర్సుల కన్వర్షన్కు పెట్టుకున్నాయి. ఈ రెండు ఫైల్స్ కూడా సర్కారు వద్ద ఉన్నాయి.
వీటిపై ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. కొత్త సీట్లకు అనుమతిస్తే.. ఫీజు రీయింబర్స్ మెంట్ భారం సర్కారుపై పడే అవకాశం ఉంది. దీంతో వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతించే అవకాశాలను సర్కారు పరిశీలిస్తోంది. ఈ నెల 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉండటంతో, అప్పటిలోగా కొత్త సీట్లపై క్లారిటీ రానున్నట్టు అధికారులు చెప్తున్నారు.