కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఒకరు రాయాల్సిన పదో తరగతి పరీక్షను మరొకరు రాస్తూ పట్టుబడ్డారు. మఠంపల్లి మండలం పెదవీడు జడ్పీ స్కూల్కు చెందిన బానోతు హనుమ కోదాడ సిటీ సెంట్రల్స్కూల్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. శుక్రవారం సైన్స్ ఎగ్జామ్ ఉండడంతో అతని స్థానంలో మఠంపల్లి మండలం కృష్ణ తండాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ పానగల్లు మంజునాథ పరీక్షకు హాజరయ్యాడు. ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న శైలజ సంతకం చేస్తున్నప్పుడు మంజునాథపై అనుమానం వచ్చింది. హాల్ టికెట్పై ఉన్న ఫొటోకు, పరీక్ష రాస్తున్న వ్యక్తికి తేడా ఉండడంతో సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ రాజు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన మరోసారి క్రాస్ చెక్ చేసుకుని ఒకరి పరీక్షను మరొకరు రాస్తున్నారని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోదాడ ఎస్ఐ నాగభూషణం సెంటర్కు వచ్చి మంజునాథపై కేసు నమోదు చేసి కోదాడ పోలీస్స్టేషన్ కు తరలించారు.