
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబడుతోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా తొలి వికెట్ తీయడంలో విఫలమవుతోంది. ఐదో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు బెన్ డకెట్, క్రాలీ ధాటికి ఈ టెస్ట్ ఇంగ్లాండ్ వైపుకు మొగ్గింది. ఐదో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్లు డకెట్ (64), క్రాలీ(42) ఉన్నారు. ప్రస్తుతం ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా కనిపిస్తుంది.
ALSO READ | ENG vs IND 2025: 59 మ్యాచ్ల్లో ఒకటే ఓటమి.. లీడ్స్ టెస్టులో టీమిండియాను ఊరిస్తున్న విజయం
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 254 పరుగులు చేయాలి. మరోవైపు భారత్ 10 వికెట్లు తీయాలి. రెండో సెషన్ లో ఎవరు ఆధిపత్యం చూపిస్తారో దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. వికెట్ నష్టపోకుండా 21 పరుగులతో ఐదో రోజు తొలి సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఈ సెషన్ లో 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లపై టీమిండియా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
డకెట్, క్రాలీ అలవోకగా పరుగులు రాబట్టారు. ఓ వైపు జాగ్రత్తగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో డకెట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ కు ముందు బుమ్రా బౌలింగ్ లో డకెట్ రిటర్న్ క్యాచ్ ఇచ్చినా బుమ్రా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ 364 పరుగులకు ఆలౌటైంది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 120 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంది.