ఒకటా రెండా..! క్రికెట్చూసి 117 రోజులైంది..! కరోనా మహమ్మారి ఆటలను అతలాకుతలం చేసి మూడు నెలలు దాటింది..! ఇన్నాళ్లూ రద్దు, వాయిదా వార్తలతో విసిగిపోయిన ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు.. పోస్ట్ కరోనా తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కు కొత్త ఊపిరిని అందించేందుకు ఆట మళ్లీ ఆరంభమవుతోంది..! ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు షురూ అయ్యేది నేడే..! ప్రేక్షకులు లేని స్టేడియాలు, చేతులు కలపలేని సంబరాలు, సలైవా వాడలేని బంతులు, స్టేడియం దాటని క్రికెటర్లు.. ఇలా సరికొత్త అనుభూతిని పంచనుంది..! ఎవరెలా ఆడతారు.. ఏ జట్టు గెలుస్తుందనే లెక్కలు ఇప్పుడు అనవసరం! విజయం ఎవరిని వరించినా అది క్రికెట్ గెలుపే..! సిరీస్ ఎలాంటి ఆటంకం లేకుండా సాగితే అదే పదివేలు..! ఇంకేం ఇంట్లోనే ఉంటూ లైవ్ యాక్షన్ను ఎంజాయ్ చెయ్యండి..!
సౌతాంప్టన్: 2020 మార్చి 13. న్యూజిలాండ్,- ఆస్ట్రేలియా మధ్య చివరగా క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజు. జూన్ 8. కరోనా రక్కసి కారణంగా ఆగిపోయిన ఇంటర్నేషనల్ క్రికెట్ మళ్లీ మొదలవుతున్న తేదీ. ఈ రెండు తేదీలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్రికెట్కు ఇంత లాంగ్ బ్రేక్ వచ్చింది లేదు. వరల్డ్ వార్ టైమ్లోనూ ఇండియాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నడిచింది. కానీ కరోనా దెబ్బకు మూడు నెలలుగా అన్ని చోట్లా క్రికెట్ ఆగింది. అయితే, ఈ లాంగ్ గ్యాప్కు నేటితో తెరపడనుంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్,- వెస్టిండీస్ మధ్య ఫస్ట్ మ్యాచ్ ఇక్కడి ఏజెస్ బౌల్ స్టేడియంలో బుధవారమే మొదలవుతోంది. పోస్ట్ కరోనా తర్వాత జరిగే తొలి సిరీస్గా చరిత్రలో నిలిచిపోయే ఈ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇంగ్లిష్ ఆటగాళ్లు, కరీబియన్ క్రికెటర్లు ఉత్సాహంగా ఉన్నారు. జో రూట్ గైర్హాజరీలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఫస్ట్ టైమ్ టీమ్ను నడిపిస్తుండగా.. నెల రోజుల కిందటే ఇంగ్లండ్ వచ్చిన జేసన్ హోల్డర్ కెప్టెన్సీలోని విండీస్ స్టేడియం నుంచి అడుగు బయటపెట్టకుండా ప్రాక్టీస్లో నిమగ్నమైంది. రూట్ లేకపోయినా సొంతగడ్డపై ఇంగ్లండే బలంగా కనిపిస్తున్నప్పటికీ .. ఇప్పటికే ఈ వాతావరణానికి అలవాటు పడిన విండీస్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. కరోనా భయంతో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఇక్కడికి రాకపోవడంతో కరీబియన్ బ్యాటింగ్ కాస్త వీక్గా ఉంది. తమలో తాము ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఈ విషయం బయటపడింది. కానీ, హోమ్టీమ్తో ఢీ అంటే ఢీ అనే బలమైన బౌలింగ్ లైనప్ కరీబియన్ టీమ్కు ప్లస్ పాయింట్. అటువైపు బర్న్స్, సిబ్లే, జో డెన్లీ, క్రావ్లేలతో అంతగా అనుభవం లేని టాప్, మిడిలార్డర్ను నడిపించడం స్టాండిన్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు సవాలే.
కొత్తగా.. వింతగా
ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. ఇరు జట్లూ గ్రౌండ్, స్టేడియంలో పరిసరాల్లోనే ఉన్న హోటల్ను దాటి వెళ్లకుండా.. ఇతరులు లోపలికి రాకుండా లక్ష్మణ రేఖ గీసింది. ప్లేయర్లు ప్రతి రోజూ ప్రాక్టీస్కు వస్తున్నప్పుడల్లా టెంపరేచర్ చెకింగ్స్, వారానికోసారి కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇదంతా కొత్త, వింత అనుభూతి. అలాగే, ఫస్ట్ టైమ్ ఎమ్టీ స్టేడియంలో ఆడబోతున్నారు. వికెట్లు తీసినా, బౌండ్రీలు వచ్చినా, సెషన్, ఇన్నింగ్స్.. చివరకు మ్యాచ్ పూర్తయినా ఆటగాళ్లు ఒకరినొకరు తాకకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందే. ఇవన్నీ ఆటగాళ్లపై మానసికంగా ఎంతోకొంత ప్రభావం చూపిస్తాయి. పైగా, కరోనా భయంతో బాల్పై సలైవా రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. చెమటను వాడేందుకు మాత్రం వెలుసుబాటు ఇచ్చింది. ఒకవేళ బౌలర్లు, ఫీల్డర్లు బాల్పై సలైవా రుద్దితే అంపైర్లు రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు. అయినా రిపీట్ చేస్తే మాత్రం బ్యాటింగ్కు టీమ్కు ఐదు రన్స్ పెనాల్టీ విధిస్తారు. సలైవా రుద్ది.. బాల్ను షైన్ చేసి స్వింగ్ రాబట్టడం పేసర్లకు అలవాటు. మరి సలైవా లేకుండా ఇటు అండర్సన్ అండ్ కో, అటు కీమర్ రోచ్ తదితరులు స్వింగ్ ఎలా రాబడతారో చూడాలి.
జట్లు (అంచనా);
ఇంగ్లండ్ : రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రావ్లే, జో డెన్లీ, ఒలీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్/ మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, డామ్ బెస్.
వెస్టిండీస్: జాన్ కాంప్బెల్, క్రెయిగ్ బ్రాత్వైట్, బ్రూక్స్, షై హోప్, రోస్టన్ ఛేజ్/బ్లాక్వుడ్, షేన్ డోరిచ్ (కీపర్), హోల్డర్ (కెప్టెన్) , కార్న్ వాల్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, గాబ్రియెల్.