- మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు పడడమే కారణం
- గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల వైపు ఇన్వెస్టర్లు పరుగు
- డిసెంబర్ నుంచి జనవరికి రెండింతలు పెరిగిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: షేర్లకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు తగ్గుతున్నాయి. గ్లోబల్గా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు నెలకొనడంతో మార్కెట్లో పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో ఇన్వెస్టర్లు గోల్డ్, వెండి వంటి కమొడిటీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో డబ్బులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చిన నెట్ ఇన్ఫ్లోలు రూ.24,028 కోట్లుగా నమోదయ్యాయి.
ఇది కిందటేడాది డిసెంబర్లో వచ్చిన రూ.28,054 కోట్లతో పోలిస్తే 14శాతం తక్కువ. నవంబర్లో రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించగలిగాయి. మార్కెట్లో వోలటాలిటీ ఉన్నా ఇన్ఫ్లోలు నిలకడగా ఉన్నాయని, సిస్టమాటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ల ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ఎనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి లాభాలిస్తుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో ఉందని అన్నారు.
కాగా, సిప్ల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు ఫండ్స్లో పెడుతున్న పెట్టుబడుల విలువ జనవరిలో రూ.31 వేల కోట్ల వద్ద నిలకడగా ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు తగ్గాయని, ఇన్ఫ్లోలు బాగానే ఉన్నా, పెట్టుబడులు పెరగడంలో వేగం తగ్గిందని హిమాన్షు తెలిపారు. ‘ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. కంపెనీల వాల్యూయేషన్స్ పెరగడం, మార్కెట్ తాజాగా పడడంతో నిర్ధిష్టమైన షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు”అని వివరించారు.
మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరిలో మిడ్ క్యాప్ ఆధారిత ఫండ్స్లోకి నికరంగా రూ.3,185 కోట్లు, స్మాల్ క్యాప్ ఆధారిత ఫండ్స్లోకి రూ.2,942 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెలలో వచ్చిన వరుసగా రూ.4,176 కోట్లు, రూ.3,824 కోట్ల ఇన్ఫ్లోలతో పోలిస్తే బాగా తగ్గాయి. ఈక్విటీ స్కీమ్లలో కూడా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోకి రూ.7,672 కోట్లు, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లోకి రూ.3,182 కోట్లు, లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి రూ.2,005 కోట్లు వచ్చాయి.
మరోవైపు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) నుంచి నికరంగా రూ.594 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు తగ్గుతున్నా, మొత్తం ఇండస్ట్రీ మేనేజ్ చేస్తున్న ఆస్తుల విలువ (ఏయూఎం) డిసెంబర్లోని రూ.80.23 లక్షల కోట్ల నుంచి రూ.81.01 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్లోకి జనవరిలో నికరంగా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కిందటేడాది డిసెంబర్లో రూ.66,591 కోట్లు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. జనవరిలో డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.74,827 కోట్లు రావడం విశేషం. అంతకుముందు నెలలో రూ.1.32 లక్షల కోట్లు, నవంబర్లో రూ.25,692 కోట్లు ఈ ఫండ్స్ నుంచి వెళ్లిపోయాయి.
ఈక్విటీని మించిన గోల్డ్
కిందటి నెలలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ల)లోకి భారీగా ఇన్ఫ్లోలు నమోదయ్యాయి. మొత్తం రూ.24,040 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది డిసెంబర్లో వచ్చిన రూ.11,647 కోట్లతో పోలిస్తే రెండింతలు ఎక్కువ. మొదటిసారి గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్ఫ్లోలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడుల (రూ.24,028.6 కోట్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి. వెండి ధరలు తగ్గుతున్నా, జనవరిలో సిల్వర్ ఈటీఎఫ్లలోకి నికరంగా రూ.9,463 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇది డిసెంబర్తో పోలిస్తే 139శాతం పెరుగుదల. బంగారం, వెండి గత ఏడాది ఇతర ఆస్తులతో పోలిస్తే మెరుగైన రాబడులు ఇచ్చా యని, అందుకే ఇన్వెస్టర్లు వీటివైపు ఆకర్షితులవుతున్నారని ఎనలిస్టులు తెలిపారు. అంతేకాకుండా తమ పోర్టుఫోలియో డైవర్సిఫికేషన్ కోసం వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్లలో మొత్తం ఇన్ఫ్లోలు రూ.61,000 కోట్లకు చేరాయి. జనవరి చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల ఏయూఎం రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ఇది గత సంవత్సరం జనవరి నాటికి ఉన్న రూ.1.28 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. వెండి ఈటీఎఫ్ల ఏయూఎం కిందటి నెలలో రూ.1.16 లక్షల కోట్లకు చేరింది.
