- హైదరాబాద్లోని విద్యుత్ నియంత్రణ భవన్ వద్ద ఏర్పాట్లు
- లైసెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటామంటున్న బీఆర్ఎస్
- మీటింగ్లో పాల్గొంటామని ప్రకటించిన కేటీఆర్
- కాంగ్రెస్ తరఫున హాజరుకానున్న భువనగిరి ఎంపీ చామల, ఎమ్మెల్సీ కోదండరాం
- రైతుల పక్షాన వాదనలు వినిపించనున్న కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘రైతు డిస్కమ్’కు లైసెన్స్ జారీ చేసే అంశంపై ఈఆర్సీ (విద్యుత్ నియంత్రణ మండలి) నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. హైదరాబాద్లోని విద్యుత్ నియంత్రణ భవన్లో కమిషన్ చైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు డిస్కమ్కు లైసెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్లో పాల్గొంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా వెల్లడించారు. మరోవైపు, కాంగ్రెస్ తరఫున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం హాజరుకానుండగా, రైతుల పక్షాన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని తమ వాదనలు, అభిప్రాయాలను వినిపించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తరఫున పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అభ్యంతరాలపై చర్చ..
రైతు డిస్కమ్ను మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైతులు, నీటి సరఫరా, ఇతర ముఖ్య రంగాలకు విద్యుత్ సేవలను మెరుగుపరచడం ఈ డిస్కమ్ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొన్నది. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, మున్సిపల్ నీటి కనెక్షన్లకు ఈ డిస్కమ్ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఈఆర్సీ నుంచి లైసెన్స్ పొందడానికి రైతు డిస్కమ్ ఆఫీసర్లు దరఖాస్తు చేసుకోగా, ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను కోరుతూ ఈఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఈ-మెయిల్, రాతపూర్వకంగా మొత్తం 32 అభ్యంతరాలు వచ్చాయి. నేటి సమావేశంలో రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఎన్జీవో సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని అధికారులు సూచించారు.
