పాలమూరు కాంగ్రెస్​లో కుదుపు

పాలమూరు కాంగ్రెస్​లో కుదుపు
  •     పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం
  •     బీఆర్ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​
  •     దేవరకద్రలో గుర్రుగా ఉన్న అసమ్మతి లీడర్లు
  •     క్యాడర్​ను తమ వైపు మళ్లించుకుంటున్న అపోజిషన్​ పార్టీలు

మహబూబ్​నగర్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీలో అసమ్మతి లీడర్లు రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హైకమాండ్​ టికెట్లు నిరాకరించడంతో రాజీనామా చేస్తున్నారు. తాజాగా నాగర్​కర్నూల్​ టికెట్​ ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జడ్చర్ల టికెట్​ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ ఏకంగా పార్టీ మారడం హాట్​ టాపిక్​గా మారింది. దేవరకద్రకు చెందిన అసమ్మతి లీడర్లు సోమవారం పాలమూరులో ప్రెస్​మీట్​ పెడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్​ లిస్ట్​పై గుర్రు.. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు, కాంగ్రెస్​ పార్టీ ఈ నెల 15న రిలీజ్​ చేసిన ఫస్ట్​ లిస్టులో 8 సెగ్మెంట్లకు, మూడు రోజుల కింద రిలీజ్​ చేసిన సెకండ్​ లిస్టులో పెండింగ్​లో ఉన్న ఆరు స్థానాలకు క్యాండిడేట్లను ఫైనల్​ చేసింది. క్యాండిడేట్లను ఫైనల్​ చేసినప్పటి నుంచి అసంతృప్తులు నిరసనలకు దిగుతున్నారు. తమకు కాకుండా ఇతరులకు టికెట్లు ఎలా ఇస్తారంటూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నాగర్​కర్నూల్​ టికెట్​ తనకే వస్తుందని ముందు నుంచి ప్రచారం చేసుకున్న మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి.. టికెట్​ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఫస్ట్​ లిస్టులోనే ఈ సెగ్మెంట్​ నుంచి యువ లీడర్​ కూచుకుళ్ల రాజేశ్​రెడ్డికి హైకమాండ్​ టికెట్​ కన్ఫాం చేసింది. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న తనకే టికెట్​ కేటాయించాలంటూ నాగం డిమాండ్​ చేస్తున్నారు.

సెకండ్​ లిస్టులోనైనా మార్పు ఉంటుందని ఆశించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం కాంగ్రెస్​ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు జానారెడ్డి, జిల్లెల చిన్నారెడ్డి బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇక బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి వనపర్తి టికెట్​ ఆశించారు. సెకండ్​ లిస్ట్​లో చిన్నారెడ్డి పేరు ఖరారు కావడంతో ఆయన వర్గం లీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకొని మేఘారెడ్డికి టికెట్​ ఇప్పించాలని డిమాండ్​ చేస్తున్నారు.

లేనిపక్షంలో ఇండిపెండెంట్​గా పోటీలో ఉంటామనే ప్రకటనలు చేస్తున్నారు. ఆదివారం మేఘారెడ్డి వర్గం లీడర్లు వనపర్తిలో బల ప్రదర్శన చేశారు. అనంతరం మేఘారెడ్డి తన అనుచరులతో భవిష్యత్​ కార్యాచరణపై సమావేశమయ్యారు. ఇదే స్థానం కోసం ప్రయత్నం చేసిన యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివాసేనారెడ్డి నిరసన తెలిపగా, హైకమాండ్​ ఆయనతో చర్చలు జరుపడంతో సమస్య సద్దుమణిగింది. 

ALSO READ : బీజేపీలో ఆ రెండు స్థానాలపై సస్పెన్స్

దేవరకద్రలోనూ అదే పరిస్థితి..​

దేవరకద్ర టికెట్​ కోసం ప్రదీప్​కుమార్​గౌడ్​ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సెకండ్​ లిస్టులో పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్​రెడ్డి(జీఎంఆర్​)కు హైకమాండ్​ టికెట్​ కన్ఫాం చేయడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఆదివారం జీఎంఆర్​ దేవరకద్రలో ఉన్న ప్రదీప్, ప్రశాంత్​రెడ్డి ఇండ్లకు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. కానీ వారు కలువలేదని తెలిసింది. ప్రదీప్​ మహబూబ్​నగర్​లోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో సోమవారం ప్రెస్​మీట్​ పెడుతున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

జడ్చర్లలో సీన్​ రివర్స్​..

జడ్చర్ల కాంగ్రెస్​ టికెట్​ కోసం జనంపల్లి అనిరుధ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, వీరిద్దరి మధ్య హైకమాండ్​ రాజీ కుదిర్చినట్లు కొద్ది రోజుల కింద వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా జడ్చర్ల నుంచి అనిరుధ్, నారాయణపేట నుంచి బీసీ ఈక్వేషన్స్​లో ఎర్ర శేఖర్​కు హైకమాండ్​ టికెట్​ కేటాయిస్తుందనే చర్చ జరిగింది. కానీ, ఎర్ర శేఖర్​కు ఏ టికెట్ కేటాయించలేదు. అసంతృప్తితో ఉన్న ఆయన వర్గం లీడర్లు జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ఎర్ర శేఖర్​పై ఒత్తిడి తెస్తున్నారు.

కానీ, ఆయన అనూహ్యంగా ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్​ను హైదరాబాద్​లో కలిశారు. బీఆర్ఎస్​ పార్టీలో చేరి కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నారాయణపేటలో ఎస్ఆర్​ రెడ్డికి సపోర్ట్​ చేయాలనే ఈక్వేషన్​తోనే శేఖర్​ను పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. ఈ చేరికలో జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి లేకపోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

‘చే’జారుతున్న క్యాడర్..

నియోజకవర్గాల్లో లీడర్లు టికెట్ల కోసం కొట్లాటకు దిగుతుంటే.. గ్రామాలు, మండలాల్లో క్యాడర్​ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎలక్షన్​కు నెల రోజుల ముందు అసమ్మతి రాజుకోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్​ క్యాడర్​ను అపోజిషన్​ లీడర్లు తమ పార్టీల్లో చేర్చుకున్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకు ఉన్న లీడర్లనే టార్గెట్​ చేస్తూ.. వారికి పలు రకాల హామీలు ఇచ్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.