ఎన్యూమరేషన్ ఫామ్స్ లో తప్పులు ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ కు పాట్లు

ఎన్యూమరేషన్ ఫామ్స్ లో తప్పులు  ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ కు పాట్లు
  • బార్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలు చూస్తున్న ఆపరేటర్లు 
  •      అసెంబ్లీ, పార్ట్ , సీరియల్ నెంబర్లు తప్పుగా రాస్తున్న ఓటర్లు
  •     ఫోన్లు చేసి పిలుస్తున్న ఆపరేటర్లు   20 శాతం కూడా ఎంట్రీ చేయలే  
  •     మరో 10 రోజుల్లో ముగియనున్న గడువు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఎస్‌‌ఐఆర్  ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదవుతున్న తప్పిదాలు డిజిటలైజేషన్‌‌కు అడ్డంకిగా మారాయి. ఓటర్లు ఫామ్స్ ను తప్పుగా నింపుతుండడంతో డేటా ఎంట్రీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. డిజిటలైజేషన్ కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఫారాలపై ఉన్న బార్‌‌కోడ్‌‌ను స్కాన్ చేసి ఓటరు వివరాలను పరిశీలిస్తుండగా, సంబంధిత ఓటరు వివరాలు కనిపించడం లేదు. దీంతో ఆ ఫామ్స్​పక్కన పెట్టి మళ్లీ సంబంధిత ఓటర్లకు ఫోన్ చేసి సరైన వివరాలతో రావాలని కోరాల్సి వస్తున్నది. అయితే, ఈ ఫోన్లకి కొందరు స్పందింస్తుండగా, మరికొందరు ఫామ్స్ ఇచ్చామని, మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 24తో సర్​ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఆ లోపే డిజిటలైజేషన్ పూర్తి కావాలి. కానీ, ఈ తప్పిదాలతో మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది.  

20 శాతం కూడా ఎంట్రీ కాలే...

హైదరాబాద్​జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 20 శాతం కూడా డేటా ఎంట్రీ పూర్తి కాలేదని తెలుస్తున్నది. మరో 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో డిజిటలైజేషన్‌‌ ప్రక్రియను స్పీడప్​చేశారు. ఓటర్లు ఫామ్స్​నింపేప్పుడు ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, అవసరమైతే సంబంధిత ఎన్నికల సిబ్బంది సహాయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

బీఎల్ వోలు స్పందించట్లే..

బీఎల్ వో లు ఫామ్స్ డిస్ట్రిబ్యూట్​చేసినప్పుడే నియోజకవర్గ సంఖ్య, పార్ట్​నంబర్, సీరియల్​నంబర్​వివరాలు ఓటర్​లిస్టులో చెక్ చేసి రాసి ఇచ్చి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కాదంటున్నారు. ఈ వివరాలు నింపడం సింపుల్ అయినప్పటికీ ఎలా చెక్​చేసుకోవాలో తెలియక, పాత ఓటర్​లిస్ట్​ అందుబాటులో లేక నింపలేకపోతున్నామని ఓటర్లు సమాధానం చెప్తున్నారు. బీఎల్ వోలు చేస్తున్న ఈ చిన్న తప్పిదాలు డిజిటలైజేషన్ కు ప్రధాన అడ్డంకిగా మారాయి. 

ఆధార్​ తప్పనిసరి కాదు   

జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫామ్​తీసుకున్న ప్రతి ఓటరు తమ వివరాలు నమోదు చేసేలా బీఎల్​వోలు , బీఎల్‌‌ఏలు, రాజకీయ పార్టీలు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం గైడ్​లైన్స్​ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డు సహా ఎలాంటి పత్రాలను తప్పనిసరిగా కోరరాదన్నారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీఎల్‌‌వోలు,   సూపర్‌‌వైజర్లు తమకు  కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి వారం సమావేశంలో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ కేంద్రాల జాబితాలను పార్టీలకు అందించాలని ఈఆర్‌‌వోలు, ఏఈఆర్‌‌వోలకు సూచించారు.  

‘సర్’ స్పీడప్ ​చేయండి  

‘సర్’ మరింత వేగవంతం చేయాలని, సంబంధిత ఈఆర్ఓ ఆఫీసుల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ డెస్క్‌‌లు ఏర్పాటు చేసి, ఏఈఆర్ఓలు పర్యవేక్షించాలని కలెక్టర్ ప్రియాంక అలా ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం బహదూర్‌‌పురా కిషన్‌‌బాగ్‌‌లోని కమ్యూనిటీ హాల్‌‌లో ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించి, బీఎల్ఓలకు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ చివరి రోజు కావడంతో ఆ లోపు ఫామ్స్​నింపి తిరిగివ్వాలని కోరారు. బహదూర్‌‌పురా తహసీల్దార్, ఏఈఆర్ఓ కె. బాల శంకర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, రమేశ్ పాల్గొన్నారు.