రాయికల్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక ఆయుధమని, సర్ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో రాయికల్ లోని గుడేటి రెడ్డి సంఘంలో సోమవారం పట్టణ కో ఆర్డినేటర్లు, బీఎల్వోలతో సర్ ప్రక్రియపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులు, గ్రామాల్లో సర్ కార్యక్రమంపై అవగాహన చేపట్టాలని, బీఎల్వోలు పంపిణీ చేసిన ఓటర్ ఏన్యూమరేషన్ గణన పత్రాల్లో ప్రజలు సరైన సమాచారం పూరించేలా నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం సర్వేలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాటమయ్య కిట్ల పంపిణీ
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్ మండల ఒడ్డె లింగాపూర్, తాట్లవాయి గ్రామాల్లో గీతా కార్మికులకు 100 శాతం సబ్సిడీతో 160 కాటమయ్య రక్షణ కిట్ల ను ఎమ్మెల్యే సంజయ్పంపిణీ చేసారు. ఆయా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జి.నందయ్య, మండల, పట్టణ అధ్యక్షులు రవీందర్ రావు, వాసం రాజేందర్, ఆత్మ చైర్మన్ కె.గంగారెడ్డి, పాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, కె.శ్రీనివాస్, డీసీసీ జిల్లా కార్యదర్శి ఎంఏ ముఖిద్, జిల్లా ఎస్టీ సెల్, ఎస్సీ సెల్అధ్యక్షులు సురేందర్ నాయక్, రాజ్ కుమార్, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.
