
- కుంగిన పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లివ్వాలి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా? ఆధారాలు అన్నీ ఇస్తాం. బట్ట కాల్చి మీద వేస్తున్నారు. ప్రతి నిర్ణయానికి కేబినెట్ రాటిఫికేషన్ జరుగుతుంది. డిపార్ట్ మెంట్లలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. నాడు కేబినెట్లో పెట్టండని సీఎం హోదాలో కేసీఆర్ చెప్పేవారు. ఇది నిజం కాకుంటే నేను దేనికైనా సిద్ధం” అని ఆయన చెప్పారు. గురువారం సికింద్రాబాద్ లో మీడియాతో ఈటల మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మించడాన్ని, అవినీతిని వేర్వురుగా చూడాలన్నారు.
ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని సంపాదించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారని, కానీ పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. ‘‘విచారణను కమిషన్ పూర్తి చేసి, అవినీతిని నిగ్గుతేల్చాలి. సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ప్రాజెక్టును ఏటీఏంగా మార్చుకున్న కల్చర్ను తప్పు పడుతున్నాం. దమ్ముంటే రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. కుంగిన పిల్లర్లు రిపేరు చేసి నీళ్లు ఇవ్వాలని, అవినీతి చేసిన వారిని వదలిపెట్టొద్దన్నారు.