జిహాద్ భావన కేవలం ఖురాన్ లోనే కాదు.. భగవద్గీత, క్రిస్టియానిటీలోనూ ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ జీవితగాథ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ మాటలు మాట్లాడారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భాజపా.. కాంగ్రెస్ చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటిల్ వ్యాఖ్యలు నిదర్శనమని విమర్శించింది. జిహాద్ గురించి గీతలో ప్రస్తావించారన్న శివరాజ్ పాటిల్.. మహాభారత యుద్ద సమయంలోనూ శ్రీ కృష్ణుడు, అర్జునుడికి పాఠాలు చెప్పాడని తెలిపారు.
ఇస్లాం, క్రిస్టియానిటీలోనూ జిహాద్ గురించి చెప్పారని శివరాజ్ పాటిల్ అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, స్వచ్ఛమైన ఆలోచనను అర్థం చేసుకోకపోతేనే బలాన్ని ఉపయోగించాలని, ఇది ఖురాన్ తో పాటు గీతలో ప్రస్తావించబడిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ దీటుగా స్పందించింది. బీజేపీ ప్రతినిధి షెహజాద్ జైహింద్ కాంగ్రెస్ను హిందూ ద్వేషి అని ఆరోపించారు. రాముడి ఉనికిని వ్యతిరేకిస్తోందన్నారు.
