తాగి కారు నడుపుతూ బైకును ఢీకొన్న .. ఇంద్రకరణ్​ రెడ్డి బంధువు

తాగి కారు నడుపుతూ బైకును ఢీకొన్న .. ఇంద్రకరణ్​ రెడ్డి బంధువు

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ కాలనీ ఫోరం మాల్​సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రాంగ్​ రూట్లో వచ్చిన కారు.. బైక్​ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పబ్​లో ఫ్రెండ్స్​లో కలిసి అతిగా మద్యం తాగిన మాజీ మంత్రి సమీప బంధువైన ఓ యువకుడు కారు నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. బీఆర్​ఎస్​ మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డికి సమీప బంధువైన అల్లోల అగ్రజ్​రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్​కు వచ్చి జీడిమెట్ల పరిధిలోని స్ప్రింగ్​ఫీల్డ్​కాలనీలో ఉంటున్నాడు. కేపీహెచ్​బీ కాలనీలో నివసించే అతని ఫ్రెండ్స్​ చిద్దన్​ తేజ, కార్తిక్​తో కలిసి తన కారులో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఒక పబ్​కి వెళ్లారు.

పబ్​లో మద్యం తాగిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లటం కోసం ఆన్​లైన్​ లో కారు డ్రైవర్​ను కూడా బుక్​ చేసుకున్నారు. అయితే, ఆ డ్రైవర్​ని కారు వెనుక కూర్చోమని చెప్పి అగ్రజ్​రెడ్డి డ్రైవింగ్​ చేశాడు. అర్థరాత్రి 1.30 సమయంలో కేపీహెచ్​బీకాలనీ ఫోరం మాల్​ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఉషా ముళ్లపూడి రోడ్డులోని జయనగర్​లో నివసించే రాజస్థాన్​కు చెందిన భన్వరిలాల్, ధూర్​చంద్.. ​ఫోరం మాల్​లో సినిమా చూసి బైక్​పై ఇంటికి వెళుతున్నారు. గచ్చిబౌలి వైపు నుంచి రాంగ్​ రూట్​లో వచ్చిన అగ్రజ్​రెడ్డి.. ఫోరం సర్కిల్​ వద్ద కారుతో వారి బైక్​ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్​ మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.