కరీంనగర్: దళితబంధు ఆపాలంటూ ఎన్నికల కమిషన్కు మేం చెప్పినట్లు నిరూపిస్తారా? అని మాజీ మంత్రి విజయ రామారావు సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన లేఖలో దళితబంధు గురించి ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మీవన్నీ దొంగ మాటలు. అయ్యా, కొడుకు, అల్లుడు అందరూ దొంగ మాటలు చెప్పి హుజురాబాద్లో బయటపడాలని చూస్తున్నారు. దళితబంధు అమలు చేసే శక్తి మీకు లేదు. ఖజానా ఖాళీగా ఉంది. ఎవరి ద్వారా ఈసీకి లెటర్ వెళ్ళింది? పద్మనాభరెడ్డి ద్వారా ఈ పని కేసీఆరే చేశారు. మేమంతా దళితబంధును ఆహ్వానించాం. దళితబంధు హుజురాబాద్తో పాటు రాష్ట్రమంతా ఇవ్వాలని కోరాం. మరో నాలుగు మండలాలను దళితబంధు కోసం నామ మాత్రంగా ప్రకటించారు. కేసీఆర్ దళితబంధు ఇవ్వడు. కార్యక్షేత్రంలో మేం ముందు ఉన్నామని మా పార్టీని బద్నాం చేస్తున్నారు. హుజురాబాద్లో ఓడిపోతారని వాళ్ళ మాటల్లోనే అర్థమవుతోంది. దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తల మీద మెడ ఉండదని చెప్పలేదా? మూడు ఎకరాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు. దళితబంధు కూడా అలాంటిదే. కేసీఆర్ అసలు రంగు బయటపడింది. ఆయనను ఇక ఎవరూ నమ్మరు. గతంలో కేసీఆర్ దుబాయ్ బ్రోకర్గా పనిచేసి అనేకమందిని మోసం చేశాడు. మోసం చేయడం ఆయనకు అలవాటు. కేసీఆర్ మాయ మాటలు ప్రజలు ఇక నమ్మరు. ఈటల రాజేందర్కు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది’ అని విజయ రామారావు అన్నారు.
For More News..