బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు.!

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు.!

 బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.  అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.  జూన్ 30న మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. సింగిల్ నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

అధ్యక్ష రేసులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు వినిపించాయి. అయితే అధిష్టానం రామచందర్ రావు వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. జూన్ 30న  బీజేపీ స్టేట్ ఆఫీసులో అధ్యక్ష, నేషనల్ కౌన్సిల్ సభ్యుల పదవులకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆశావహులనుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.  అయితే సింగిల్ నామినేషన్ వేసేలా అధిష్టానం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

పాత, కొత్త నేతల మధ్య పోటీ..

బీజేపీ అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడ్డారు. పార్టీలో ముఖ్య నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లు, ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరిన వాళ్లుగా డివైడ్ అయ్యారు. అధ్యక్ష పదవికి మొదటినుంచీ ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్​ధర్మపురి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పాత నేతల్లో ఎక్కువ మంది రాంచందర్ రావు పేరును సూచించారు. 

నేషనల్ కౌన్సిల్ కూ పోటీయే 

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకూ నామినేషన్లను తీసుకోనున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్కరు చొప్పున మొత్తం తెలంగాణ నుంచి 17 మందిని ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా సెగ్మెంట్ల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు.  జాతీయ అధ్యక్షుడిని ఈ నేషనల్ కౌన్సిల్ సభ్యులే ఎన్నుకోనున్నారు.