జగిత్యాల కలెక్టర్ కు ఎక్స్ లెన్స్ అవార్డ్

జగిత్యాల కలెక్టర్ కు ఎక్స్ లెన్స్ అవార్డ్

న్యూఢిల్లీ, వెలుగుజగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ ను ‘ఎక్సలెన్సీ ఇన్ గవర్నెన్స్’ అవార్డు వరించింది. ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో శరత్ ఉత్తమ కలెక్టర్​గా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రులు రామ్​విలాస్ పాశ్వాన్, రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా బుధవారం ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఉత్తమ పాలన, వినూత్న ఆలోచనలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 686 మంది జిల్లా కలెక్టర్ల పనితీరును జ్యూరీ పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాలన, కేసీఆర్ కిట్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. తనకు అవార్డు రావడంపై శరత్ సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది పనితీరుతో పాటు, స్థానిక ప్రజల ఆలోచన విధానమే అవార్డు రావడానికి కారణమని వివరించారు. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందని, మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధించేలా ప్రణాళికలతో పాలన సాగిస్తానని చెప్పారు. శరత్ గతంలో కేంద్రం నుంచి స్వచ్ఛ పురస్కార్ అవార్డు, రాష్ర్ట ప్రభుత్వ ఎక్సలెన్సీ అవార్డులను రెండు సార్లు అందుకున్నారు.