NEET నుంచి గ్రూప్స్ వరకు.. పేపర్ లీక్స్ ఎలా జరుగుతాయో కళ్లకు కట్టిన సిరీస్.. ఎవ్రీవన్ మస్ట్‌ వాచ్

NEET నుంచి గ్రూప్స్ వరకు.. పేపర్ లీక్స్ ఎలా జరుగుతాయో కళ్లకు కట్టిన సిరీస్.. ఎవ్రీవన్ మస్ట్‌ వాచ్

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిందనే సంతోషపడాలో, లేదా దానివల్ల జరుగుతున్న అక్రమాల వల్ల బాధపడాలో తెలియని పరిస్థితి. మన ఇండియాలో ఏ రాష్టం చూసుకున్న, క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు, నీట్ నుంచి గేట్ వరకు.. ఇలా ఏదో ఒక ఎగ్జామ్ లీక్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని నిరంతరం కలలు కన్న స్టూడెంట్స్ ఆశలు ఆవిరైపోతున్నాయి. కానీ, అడ్డదారిలో పైసలిచ్చిన వారు మాత్రం పేపర్ లీకేజీల వల్ల ఫస్ట్ ర్యాంకులతో దేశాన్ని ఆగం చేస్తున్నారు.

అయితే, ఈ పేపరు లీకులు ఎలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక సస్పెన్స్! అలాంటి సస్పెన్స్ సంఘటనలతో వచ్చిన రీసెంట్ వెబ్ సిరిసే ‘‘ఎగ్జామ్’’(EXAM). ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఎ. సర్కునం తెరకెక్కించిన ఈ మూవీలో దుషార విజయన్, అదితి బాలన్, అబ్బాస్ నటించి మెప్పించారు.

కథేంటంటే..?

ఝాన్సీ (దుషారా విజయన్) రీజనల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల ఎంతో నష్టపోతుంది. అదే టైంలో ఉతగమలై అనే కల్పిత పట్టణంలో డీఎస్పీగా బాధ్యతలు తీసుకోవడానికి మారమల్లి (అదితి బాలన్) అనే ఆఫీసర్‌‌‌‌ వస్తుంది. అయితే.. స్టేషన్‌‌కు చేరుకోకముందే ఆమెని ఝాన్సీ కిడ్నాప్‌‌ చేస్తుంది. ఆమె స్థానంలోకి ఆఫీసర్‌‌‌‌గా వెళ్లి వేలాదిమంది స్టూడెంట్స్‌‌ జీవితాలను ధ్వంసం చేస్తున్న ఆ భారీ కుట్రను బయటపెట్టాలి అనుకుంటుంది. కానీ, లోతుగా ఇన్వెస్టిగేట్‌‌ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్‌‌లోని కరప్షన్ చైన్ బయటపడుతుంది. ఆ నెట్‌‌వర్క్‌‌ను ఝాన్సీ బయటపెట్టగలిగిందా? ఆ క్రమంలో ఎలాంటి ఆపదల్లో చిక్కుకుంది? తెలియాలంటే వెబ్‌‌ సిరీస్‌‌ చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా తరచూ వెలుగులోకి వస్తున్న ఎగ్జామ్ పేపర్ లీక్‌లు, రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి వంటి సున్నితమైన అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఎగ్జామ్’. కేవలం థ్రిల్లర్‌గా కాకుండా, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే మాఫియా వ్యవస్థపై గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేసింది ఈ సిరీస్.

కథ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులను సస్పెన్స్‌లోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. పేపర్ లీక్ కారణంగా జీవితాన్ని కోల్పోయిన యువతిగా ఝాన్సీ పాత్రలో దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. ఆవేదన, ఆగ్రహం, పోరాట చేయడంలో ఆమె సహజంగా నటించి మెప్పించింది. మరోవైపు డీఎస్పీ మారమల్లి పాత్రలో అదితి బాలన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

సిరీస్ ప్రధాన బలం కథలోని రియాలిటీ. ఎగ్జామ్ లీక్‌లు ఎలా జరుగుతాయి? వాటి వెనుక రాజకీయ, అధికార, విద్యా వ్యవస్థల ప్రమేయం ఎలా ఉంటుంది? అనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు రావడంతో కథ ఎక్కడా బోర్ కొట్టదు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతూ ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేస్తాయి.

అయితే కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని పాత్రలకు మరింత బలమైన బ్యాక్‌స్టోరీ ఉంటే ఎమోషనల్ కనెక్షన్ ఇంకా పెరిగేది. అయినప్పటికీ మెయిన్ పాయింట్, సామాజిక సందేశం ఆ చిన్న లోపాలను అధిగమిస్తాయి. ముఖ్యంగా ఫేక్ ఐడెంటిటీతో ఝాన్సీ.. డీఎస్పీ మారమల్లి పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్‌లో విజువల్ ట్రీట్‌మెంట్ ఆకట్టుకుంటుంది. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసలమీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది.

బయట కూడా ఇలాంటి వ్యక్తులే ఉంటారా?

సిరీస్ చూసిన తర్వాత అసలు ఎగ్జామ్ పేపర్ లీకుల వెనుక, బయట కూడా ఇలాంటి వ్యక్తులే ఉంటారా? ఇలాంటి నెట్‌వర్క్‌లే పనిచేస్తున్నాయా? అనే సందేహం ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఈ లీక్ స్కామ్‌లో ఎలాంటి అధికారులు, ఎన్ని స్థాయిల వ్యవస్థలు భాగస్వామ్యం అవుతాయి అనే విషయాన్ని మాత్రం రివ్యూలో రివీల్ చేయడం లేదు. ఎందుకంటే ఆ అంశాలే సిరీస్‌లో కీలకమైన ట్విస్టులు. వాటిని ముందుగానే చెప్పేస్తే వచ్చే ఉత్కంఠ, థ్రిల్ తగ్గిపోతాయి. అందుకే ఆ సస్పెన్స్‌ను చూస్తూనే ఫీల్ అవ్వడం మంచిది. 

ఓవరాల్‌గా..‘ఎగ్జామ్’ కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ కాదు. విద్యా వ్యవస్థలోని లోపాలు, అవినీతి వల్ల విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో చూపించే సామాజిక కథ కూడా. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది. మస్ట్‌ వాచ్ ఫర్ ఎవ్రీవన్.