వంద నియోజకవర్గాల్లో పెట్టే ఖర్చు ఒక్క హుజూరాబాద్ లో పెడుతున్నారు 

వంద నియోజకవర్గాల్లో పెట్టే ఖర్చు ఒక్క హుజూరాబాద్ లో పెడుతున్నారు 
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క

హనుమకొండ జిల్లా: వంద నియోజకవర్గాల్లో పెట్టే ఖర్చు ఒక్క హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిధిలోని హనుమకొండ జిల్లా గూనిపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తో కలసి ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి నాయకుడుగా నిరుద్యోగ సమస్యలపై పోరాడిన చరిత్ర బల్మూరి వెంకట్ కు ఉందన్నారు. తొలిసారి కరోనా విజృంభించి ప్రజలు చనిపోతున్న సమయంలో ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ బల్మూరి వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పంచిన ఇందిరమ్మ భూములు, ఇందిరమ్మ  ఇండ్లు తప్ప ఈ ఏడు సంవత్సరాలలో టీఆర్ఎస్, బీజేపీ చేసింది ఏమీలేదన్న విషయం ప్రజలకు తెలుసు అన్నారు.

వంద నియోజకవర్గాల్లో పెట్టే ఖర్చును అధికార టీఆర్ఎస్, బీజేపీలు కలసి ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే పెడుతున్నాయని ఆమె విమర్శించారు.  ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను ఒకవైపు బీజేపీ ప్రైవేట్ పరం చేస్తుంటే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఆస్థులన్నీ అమ్మేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా దేశ స్థాయిలో దేశద్రోహ కేసులు పెడుతున్నారని, ఇక్కడికి వస్తే అసమ్మతి కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.