న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో ఇబ్బందులు కొనసాగుతున్నా, దేశ ఎగుమతులు జనవరిలో పెరిగాయి. ఎగుమతులు 3.12 శాతం పెరిగి (ఇయర్ ఆన్ ఇయర్) 36.92 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు కూడా 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ట్రేడ్ డెఫిసిట్ 17.49 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జనవరి మధ్య ఎగుమతులు 4.89 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గి 353.92 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 6.71 శాతం పడి 561.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
సర్వీస్ సెక్టార్లో పెరిగిన మిగులు ..
సర్వీస్ సెక్టార్ దూసుకుపోతోంది. కిందటేడాది అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్లో సర్వీస్ సెక్టార్లో మిగులు రికార్డ్ లెవెల్ అయిన 44.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 16 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఆర్బీఐ డేటా ప్రకారం, సర్వీసెస్ ఎగుమతులు డిసెంబర్ క్వార్టర్లో 5.2 శాతం వృద్ధి చెంది (ఇయర్ ఆన్ ఇయర్) 87.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు సర్వీస్ దిగుమతుల 4.3 శాతం తగ్గి 42.8 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. సర్వీసెస్ సెక్టార్లో మిగులు పెరగడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య సీఏడీ జీడీపీలో ఒక శాతంగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే టైమ్లో ఈ నెంబర్ 2.9 శాతంగా రికార్డయ్యింది.