న్యూఢిల్లీ : పెరుగుతున్న ఇన్పుట్, సరుకులు ధరలు, డాలర్ విలువ తగ్గుదల కారణంగా వచ్చే నెల నుంచి తమ వెహికల్స్ ధరలను పెంచనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గురువారం వెల్లడించింది. గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐకానిక్5 వరకు పలు బండ్లను ఇది అమ్ముతోంది. వీటి ధరలు రూ. 5.84 లక్షల నుంచి రూ. 45.95 లక్షల మధ్య ఉన్నాయి. అయితే, జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చే కొత్త ధరల వివరాలను పేర్కొనలేదు.
హెచ్ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, కంపెనీ ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు వినియోగదారులపై భారం పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయంలో కొంత భాగాన్ని కస్టమర్కు బదిలీ చేయడం ఇప్పుడు అత్యవసరమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వినియోగదారులపై ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. జనవరిలో వెహికల్స్ ధరలను పెంచుతున్నట్టు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఆడి ఇది వరకే ప్రకటించాయి.