అత్యాశతో ఆయువు తీస్తుండ్రు!..అడ్డగోలుగా అంబులెన్స్​ల దోపిడీ

అత్యాశతో ఆయువు తీస్తుండ్రు!..అడ్డగోలుగా అంబులెన్స్​ల దోపిడీ
  •     కమీషన్లు ఇచ్చే హాస్పిటల్స్​కు పేషెంట్ల తరలింపు 
  •     సరైన ట్రీట్​మెంట్​ అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు
  •     అధికారుల కంట్రోల్​ లేకపోవడంతోనే ఆగడాలు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్​ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.  ఓవైపు అడ్డగోలుగా కిరాయిలు వసూల్​ చేస్తూ.. మరోవైపు హాస్పిటల్స్​ ఇచ్చే కమీషన్ల కోసం కొందరు డ్రైవర్లు  కక్కుర్తి పడుతున్నారు. కమీషన్​ ఇచ్చే ప్రైవేట్​  హాస్పిటల్స్ కు పేషెంట్లను తరలిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  జిల్లా కేంద్రంలో దాదాపు 80 అంబులెన్స్​లు ఉన్నాయి. వీరంతా యూనియన్​గా ఏర్పడి గవర్నమెంట్​ హాస్పిటల్​ ఎదురుగా పాయింట్​ ఏర్పాటు చేసుకున్నారు.  ఇందులో 55 మంది ఉండగా, కొందరికి 2–3 అంబులెన్స్​లు ఉన్నాయి.  వీరిలో కొందరు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.  

30 – 40 పర్సెంట్​ కమీషన్ ఆశ చూపడంతోనే..

సరైన సౌకర్యాలు, క్వాలిఫైడ్​ డాక్టర్లు లేని ప్రైవేట్​ హాస్పిటల్స్ నిర్వాహకులు అంబులెన్స్​లపై ఆధారపడి కమీషన్లు అలవాటు చేశారు. మాయమాటలు చెప్పి ఒక పేషెంట్​ను అడ్మిట్​ చేస్తే 30 నుంచి 40 పర్సెంట్​ఇస్తామని ఆశ చూపిస్తున్నారు.  రూ.లక్ష బిల్లు అయితే రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఇస్తున్నారు.  నెలంతా కొట్టే కిరాయిల కన్నా కమీషన్లే లాభదాయకంగా ఉండటంతో.. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్లను కాపాడాలనే మానవత్వాన్ని మరిచి ఇలా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాలతో పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​లోని ప్రైవేట్, కార్పొరేట్​ హాస్పిటల్స్​తో టైఅప్​ అయ్యి దోపిడీ దందా సాగిస్తున్నారు.

గాల్లో కలుస్తున్న ప్రాణాలు

కొంతమంది అంబులెన్స్​ నిర్వాహకుల అత్యాశ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అన్ని సౌకర్యాలున్న మంచి హాస్పిటల్స్​కు కాకుండా కమీషన్లు ఇచ్చే దవాఖానాల్లో చేర్పించడం వల్ల అక్కడ సరైన ట్రీట్​మెంట్​ అందక పేషెంట్ల ఊపిరాగుతోంది. మార్చి 29న లక్సెట్టిపేటకు చెందిన సింధూజకు యాక్సిడెంట్​లో తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్​కు తీసుకొచ్చారు. కండీషన్​ సీరియస్​గా ఉండడంతో వెంటనే హైదరాబాద్​ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. 

కానీ, అంబులెన్స్ డ్రైవర్​​ మొదట మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కరీంనగర్​లోని మరో హాస్పిటల్​కు తీసుకెళ్లమని కోరినా వినిపించుకోకుండా సరైన సౌకర్యాలు, డాక్టర్లు లేని మరో దవాఖానాకు తీసుకెళ్లాడు. అనంతరం ఇంకో హాస్పిటల్​లో అడ్మిట్​ చేశారు. డాక్టర్లు ట్రీట్​మెంట్​ చేస్తుండగానే సింధూజ బ్రెయిన్​ డెడ్​ అయ్యింది. అరగంట ముందు తీసుకొస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబసభ్యులు వాపోయారు. బాధితుల ఫిర్యాదుతో సదరు అంబులెన్స్ డ్రైవర్​ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.  ఇలాంటి ఆరోపణలు ఉన్న మరో ఇద్దరిని స్టేషన్​కు పిలిపించి వార్నింగ్​ ఇవ్వడంతో అంబులెన్స్​ నిర్వాహకుల్లో కొంత భయం మొదలైంది. ​

కంట్రోల్​ చేసేదెవరు...?

 ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు.   అంబులెన్స్​లను కంట్రోల్​ చేయడానికి  ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​అధికారులు తమకేమీ సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్​లు కండీషన్​లో ఉన్నాయో లేదో ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. కొవిడ్​ టైమ్​లో అప్పటి మంచిర్యాల ఏసీపీ అఖిల్​ మహజన్​ అంబులెన్స్​లపై కొరడా ఝళిపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంబులెన్స్​ దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

అంబులెన్స్​లు నిర్వాహకులు రూల్స్​ ప్రకారం నడుచుకోవాలి. కమీషన్లకు ఆశపడి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. అంబులెన్స్​ల దోపిడీపై బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల సింధూజ మృతిపై వారి కుటుంబ సభ్యులు కంప్లయింట్​ చేయడంతో బాధ్యుడైన సాగర్​ను అరెస్ట్​ చేశాం. అంబులెన్స్​లతో ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.  -  ఆర్​.ప్రకాశ్​, మంచిర్యాల ఏసీపీ