
మావోయిస్టులకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరిగి శాంతి నెలకొనాలని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేకమంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చల ప్రతిపాదన కొద్దిమంది ప్రజాస్వామికవాదులతో ప్రారంభమై వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హింస ఏకపక్షంగా మారింది. ఒక్కొక్క ఘటనలో యుద్ధమరణాల స్థాయిలో మావోయిస్టులూ, ఆదివాసులూ చనిపోవటం సమాజాన్ని కలచివేసింది. ఇంతకాలం హింసావాదులుగా ప్రభుత్వమే ముద్ర వేసిన పక్షం, ఇవ్వాళ శాంతికి కట్టుబడి ఉంటామంటుంటే ప్రభుత్వం మాత్రం హింసా మార్గాన్నే ఎంచుకుంటోంది. పౌర సమాజంలో వాస్తవంగా ఎవరు హింసపై ఆధారపడుతున్నారనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది. పాలకపక్షానికి అనుకూలంగా ఉన్నవాళ్లు తప్ప మెజారిటీ ప్రజలు శాంతిచర్చలను కోరుతున్నారు. అయితే, ప్రభుత్వాన్ని మావోయిస్టులతో చర్చలు చేయాలని ఏ ప్రాతిపదికన అడగాలనే విషయంలో కొంతమందిలో కొన్ని సందేహాలు, భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం మావోయిస్టులపై పైచేయి సాధించిన దశలో, మావోయిస్టులు బలం పుంజుకోవడానికి సమయం అందివ్వటం కోసమే ఇలా చర్చల ప్రతిపాదనను ముందు పెడుతున్నారని కొందరు వాదిస్తున్నారు. చర్చలను కోరుకుంటున్న ప్రజల, ప్రజాస్వామికవాదుల, వివిధ రాజకీయ పార్టీల ఉద్దేశం అది అసలే కాదు. మావోయిస్టుల రాజకీయ బలం తగ్గటం, మిలిటరీ పరంగా కూడా వారు స్థిరంగా నష్టాల పాలే అవటం గత రెండు మూడు దశాబ్దాల పరిణామం. అదే సమయంలో వారిపై ప్రభుత్వాలు పైచేయి సాధిస్తూ వచ్చాయి. అదీ ఒక పరిణామమే. చర్చల ప్రతిపాదనకు గల నిజమైన కారణం రెండు వర్గాల మధ్యగల వివాదాన్ని ఇంత క్రూరంగా కాకుండా, మానవీయంగా పరిష్కరించడానికి గల అవకాశాలను వెతకటమే.
రాజ్యాంగ ఉల్లంఘన
రాజ్యాంగాన్ని గుర్తించని పార్టీతో రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఎలా చర్చిస్తుందని కొంతమంది వాపోతున్నారు. నిజం చెప్పాలంటే, ఇవాళ మావోయిస్టులు మాత్రమే కాదు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలూ, ప్రధాన స్రవంతి పార్టీలతో సహా ఏదో ఒకరకమైన ఆధిపత్యంలో ఉన్నవాళ్లంతా రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యాంగా ఉల్లంఘిస్తున్నవారే. అటువంటి ఎవరి మీదైనా, ఎప్పుడైనా కొన్ని కేసులు (అవీ రాజకీయ ప్రేరేపితంగానైనా) నమోదైనా అవన్నీ మినహాయింపులే కానీ, సాధారణ నియమాలు కాదు. అన్నివర్గాలూ రాజ్యాంగాన్ని మరింత ప్రజాస్వామీకరించుకుంటూ దానికి లోబడి నడవటమే రాజ్యాంగ ఆదర్శం. మావోయిస్టులు సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టకుండా శాశ్వత శాంతి ఎలా ఏర్పడుతుందనేది కొంతమంది వాదన. అటువంటిదే మరో వాదన, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి, రాజ్యాధికారంలోకి రావాలనుకునే పార్టీతో చర్చలేమిటి? వారి కోరికను ప్రభుత్వాలు తీర్చలేవు కదా! అనేది. ఈ వాదనల్లో తర్కం ఉంది కానీ ప్రజాస్వామిక దృక్పథం లేదు.
చర్చలతోనే పరిష్కారం
ప్రజాస్వామ్య సమాజం అంటేనే అవతలివారు ఎవరైనా, అది ఏ సమస్యైనా చర్చలతో పరిష్కరించుకోవటం దాని మౌలిక లక్షణం. చర్చలతో సాధ్యం కానప్పుడు రాజ్యాంగం అనుమతించిన నేర విచారణ, శిక్షాస్మృతులు ఉండనే ఉన్నాయి. అటువంటప్పుడు ఫలానా వారితో చర్చలేమిటి అనే తర్కానికి అర్థం లేదు. రాజ్యాధికారం కోసం పనిచేసే పార్టీ కూడా చర్చలలో కూర్చుంటే ప్రభుత్వాన్ని రాజ్యాధికారం అయితే అడగదు. ఆ పార్టీ బలంగా ఉన్నప్పుడు, ‘పోటీ ప్రభుత్వం‘ నడుపుతున్నప్పుడు రాజకీయ వెసులుబాటు కోసం, నిర్బంధ రహిత కాలం కోసం మాత్రమే చర్చల్లో పాల్గొనేవారేమో. అప్పుడది వారికొక వ్యూహం. అందులో కూడా ఆ పార్టీకీ, ప్రభుత్వానికీ అనుకూల, వ్యతిరేక అంశాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా రెండు వైపులనుంచి హింస గణనీయంగా తగ్గటానికైనా ప్రభుత్వం చర్చలు జరపాలి.
2004లో జరిగిన చర్చల కోసం ప్రభుత్వానికి ఎస్ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వర రావు వంటి మేధావులు ఆ మాటే చెప్పారు. చర్చలు, కాల్పుల విరమణ కాలంలో మావోయిస్టులు తిరిగి బలపడితే మళ్ళీ హింసాయుత వాతావరణం పునరావృతం అవుతుందనేది కొంతమంది అనుమానం. సాధ్యం అయితే వారు రాజకీయంగా బలపడవచ్చు, కానీ సాయుధంగా బలపడతారనేది సాకు మాత్రమే. తుపాకుల ద్వారానే ఏ ప్రభుత్వమూ సమాజంలో శాంతిని నెలకొల్పలేదు.
మానవత్వాన్ని రుజువు చేయాలి
అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు, వందలాది మంది సాయుధ మావోయిస్టులు కేంద్ర బలగాల చేతిలో చనిపోయారు. ఈ ఘటనలు పెరుగుతున్నాయే తప్ప ఆగటం లేదు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పత్తిలింగం జూన్ పదవ తేదీన ఒక ఇంటర్వ్యూలో కేవలం బస్తర్ రేంజ్ లోనే 2023 నుంచి 2025 జూన్ తొమ్మిది మధ్య 253 ఎన్కౌంటర్లలో 429 మందిని చంపేశామని, ఆపరేషన్ కగార్ ప్రారంభమైన 2024 జనవరి నుంచి ఈ ఎన్కౌంటర్లు ఎక్కువగా జరిగాయన్నారు.
ప్రభుత్వ బలగాలకు చెందిన యాభై తొమ్మిది మంది ఈ కాలంలో చనిపోయారన్నాడు. మావోయిస్టు పార్టీలో ఇక కొద్దిమంది కేంద్ర కమిటీ నాయకులు, మొత్తంగా మూడు వందల సాయుధులు మాత్రమే దండకారణ్యంలో మిగిలారని వారు మాకు లొంగిపోవాలి లేదా ఓడిపోయే యుద్ధానికి సిద్ధం కావాలని ప్రకటించాడు. కొత్తగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా కేంద్రం రంగంలోకి దింపింది. కాబట్టి చర్చలకు కేంద్రం సిద్ధంగా లేదు. మరోవైపు మావోయిస్టులూ రెండు ఘటనల్లో ఒక ఏఎస్పీనీ, గ్రామ పటేల్ అయిన ఒక ఆదివాసీని చంపేశారు. మరో ఇద్దరు పోలీసు అధికారులను తీవ్రంగా గాయపర్చారు.
మే ఎనిమిదవ తేదీన తెలంగాణకు చెందిన ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు అనుమానాస్పదంగా చనిపోయారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధపడితే రెండు వైపులా ఈ మరణాలన్నీ ఆగేవి. శాంతికి కట్టుబడి, ఒప్పందం చేసుకుంటామంటున్న వారిని చంపుకుంటూ వెళ్ళే పాలకులు నాగరిక సమాజానికి ఎంత ప్రమాదకరమో తోటి మనుషులకు తెలియ చెప్పాలి. అదే ఈ విషయంలో పౌర సమాజపు మానవీయ కర్తవ్యం. శాంతి చర్చలు జరగాలని, మానవత్వం ఇంకా మిగిలే ఉందని రుజువు కావాలని కోరుకుందాం.
శాంతిచర్చలతో ప్రాణనష్టం నివారణ
శాంతి చర్చల పర్యవసానం ఏమిటని కొందరు అడుగుతున్నారు. చర్చలు జరిగి, సఫలమైతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం నివారించబడుతుంది. ముఖ్యంగా ఆదివాసులు నిరంతర అణచివేత, అకృత్యాలు, నిర్బంధాల నుంచి విముక్తి అవుతారు. వారి ఉనికి, హక్కుల సమస్యలు కూడా చర్చల్లో కేంద్ర బిందువవుతాయి. మావోయిస్టులకు రక్తపాత మార్గాన్ని కాకుండా, ప్రజలతో కలిసి చేసే అనేకానేక రక్తపాత రహిత మార్గాలను ఎంచుకోవాల్సిన బాధ్యత పెరుగుతుంది. సమస్యను పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యత నుంచి వైదొలగి చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పటికైనా అహింసాయుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం శాంతి చర్చల రూపంలో వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ మార్గాన్నే ఎంచుకోవటం న్యాయం.
డా. ఎస్. తిరుపతయ్య, జనరల్ సెక్రటరీ, మానవ హక్కుల వేదిక