సమస్యలు లేకుండా చేస్తానని..అత్యాచారాలు చేసిండు

 సమస్యలు లేకుండా చేస్తానని..అత్యాచారాలు చేసిండు

హనుమకొండ, వెలుగు: కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానని మాయమాటలతో మహిళలు, యువతులను లోబర్చుకుని అత్యాచారాలు చేస్తున్న దొంగ బాబాను వరంగల్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.25 వేల నగదు, తాయత్తులు, వన మూలికలు, దారాలు, నిమ్మకాయలు, నూనె డబ్బాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ఏసీపీ ఎం.జితేందర్​ రెడ్డి కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన షైక్నాల లబ్బే దాదాపు 40 ఏండ్ల కింద వరంగల్ నగరానికి వచ్చి  ఏనుమాముల ఏరియాలో ఉంటున్నాడు. 

బాబా అవతారమెత్తి మంత్ర శక్తులతో కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. పలువురు మహిళలు, యువతులకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో భర్తతో విభేదాలను పరిష్కరించాలని కొద్దిరోజుల కింద ఓ మహిళ లబ్బేను సంప్రదించింది. దీంతో అతడు పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పింది. వారు టాస్క్​ ఫోర్స్​ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. టాస్క్​ ఫోర్స్​పోలీసులు నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఏనుమాముల పోలీసులకు అప్పగించారు. 

 వీరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దొంగ బాబాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్​ఫోర్స్​ సీఐలు శ్రీనివాస్ రావు, జనార్దన్​రెడ్డి, ఎస్సైలు శరత్ కుమార్, లవన్​ కుమార్,  టాస్క్​ఫోర్స్​సిబ్బంది స్వర్ణలత,  రాజేందర్, కరుణాకర్, శ్రావణ్ కుమార్, నాగరాజును టాస్క్​ఫోర్స్​ ఏసీపీ అభినందించారు.