మల్కాజిగిరి, వెలుగు: రైతులను మోసం చేస్తూ నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో సుమారు 600 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వారిని ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన చలివెందుల రాజారామ్, గోస స్వామిదాసు, అనుముల మల్లేశ్వరయ్య, కందాల చిన్న ఓబులేసుగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ ఎల్బీనగర్ బృందం, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా పెద్ద అంబర్పేటలోని పిస్తా హౌస్ సమీపంలో బుధవారం తనిఖీలు చేపట్టారు.
కారు, బొలెరోను తనిఖీ చేయగా 10 గోనె సంచుల్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలు ఉన్నాయి. పోలీసులు సీడ్స్తో పాటు రెండు వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రామ్మోహన్రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
