560 కేజీల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత ..తొమ్మిది మంది అరెస్ట్ .. ఎక్కడంటే

560 కేజీల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత ..తొమ్మిది మంది అరెస్ట్ .. ఎక్కడంటే
  • ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి

తల్లాడ, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలను ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మంది నిందితుల వద్ద సుమారు రూ.14 లక్షల విలువైన 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఖమ్మం కమిషనర్ సునీల్ దత్ ఏన్కూర్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో కేసు వివరాలను తెలిపారు.  

గత బుధవారం ఏన్కూర్ పోలీసులు, వ్యవసాయ ఆఫీసర్లకు సమాచారం అందడంతో  ఏన్కూరు గ్రామానికి వెళ్లి నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న గాజులు నరసింహారావు వద్ద ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఏపీలోని మైలవరం మండలం చంద్రుగూడెం గ్రామానికి చెందిన శాలివాహన అనే వ్యక్తి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో కల్లూరు పోలీసులు వెళ్లి ఇంటిపై దాడి చేశారు. 

కర్నాటక నుంచి మెటీరియల్ తీసుకొచ్చి రైజోబెల్ మిశ్రమాన్ని కలిపి, విత్తనాలు ప్యాక్ చేసి గాజుల నరసింహారావుతో పాటు మరి కొందరు ఏజెంట్లు ద్వారా రైతులకు అమ్ముతున్నట్టు తేలింది. నిందితుడి వద్ద అరుణోదయ లేబుల్ తో ఉన్న 272 పత్తి విత్తనాలు ప్యాకెట్లు, రెండు మెషీన్లు , ఒక వేయింగ్ మెషీన్, రైజోబెల్ మిశ్రమాన్ని సీజ్ చేశారు. ఏన్కూర్ మండలం రేపల్లెవాడలో 210 విత్తన ప్యాకెట్లు, ఏన్కూర్ లో120 కేజీలు నకిలీ విత్తనాలు, రైజోబిన్ కెమికల్ తోపాటు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  

ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ నుంచి  నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం తనిఖీల్లో దొరికిన 560 కేజీల నకిలీ హెచ్ టీ–3 పత్తి విత్తనాలను సీజ్ చేసి, 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, లూజు విత్తనాలు, నిషేధిత బీటీ పత్తి విత్తనాలు అమ్మితే అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నకిలీ విత్తనాలను పట్టుకున్న పోలీసులను సీపీ సునీల్ దత్ అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. కల్లూరు డివిజన్ ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం, ఏన్కూర్, కల్లూరు ఎస్ఐలు రఫీ, హరిత ఉన్నారు.