V6 News

ఏటీఎంలో నకిలీ నోట్లు పెట్టి అడ్డంగా దొరికాడు..రూ. 94వేల నకిలీ కరెన్సీ సీజ్, వ్యక్తి అరెస్ట్

ఏటీఎంలో నకిలీ నోట్లు పెట్టి అడ్డంగా దొరికాడు..రూ. 94వేల నకిలీ కరెన్సీ సీజ్, వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్  నగరంలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతోంది.. చాదర్‌ఘాట్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీలో చాదర్ ఘాట్ కు చెందిన అహ్మద్ భాషా అనే వ్యక్తి నకిలీ నోట్ల చలామణి చేస్తున్నట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహీంద్రా బ్యాంక్  చాంద్రాయణ గుట్ట ఏటీంఎంలో తన ఖాతా ద్వారా నకిలీనోట్లను డిపాజిట్ చేసినట్టు గుర్తించారు.  క్యాష్ రీసైక్లర్ మెషీన్ (CRM) లో రూ.500 ముఖ విలువ కలిగిన 10 నకిలీ నోట్లను గుర్తించిన  బ్యాంక్ మేనేజర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో నకిలీ నోట్ల దందా వ్యవహారం బయటపడింది. 

వృత్తి రీత్యా కసాయి అయిన అహ్మద్ భాషా గత కొంతకాలంగా  నకిలీ నోట్ల దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గుజరాత్ కు చెందిన ప్రధాని నిందితుడి ద్వారా నకిలీ నోట్లను సేకరించినట్టు అహ్మద్ భాషా విచారణలో ఒప్పుకున్నాడు. A2 గా అహ్మద్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

షాద్ నగర్ లో 94వేల విలువైన నకిలీ నోట్లను నిందితుడు అపరిచత వ్యక్తి ద్వారా సేకరించినట్లు విచారణలో తేలింది. వాటిలో రూ. 5వేల  విలువైన నకిలీ 500 నోట్లను బ్యాంకులో జమ చేశాడు. మిగతా రూ89వేల విలువైన 178 నకిలీ 500 నోట్లను నిందితుడి నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గుజరాత్ కేంద్రంగా నకిలీ నోట్ల దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.  గుజరాత్ నుంచే ప్రధాన నిందితుడు ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని అతడికోసం గాలింపు చర్చలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.