కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? చేతుల్ని శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను కొనుగోలు చేస్తున్నారా..?అయితే ఒక్క క్షణం. వైరస్ తో జనాలు భయాందోళనలకు గురవుతుంటే…దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది వ్యాపారస్థులు అడ్డదార్లు తొక్కుతున్నారు.
ప్రజెంట్ శానిటైజర్లకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని ఆసరగా చేసుకున్న కేటుగాళ్లు రకరకాల ప్రాడక్ట్స్ తో ఫేక్ శానిటైజర్లను తయారు చేస్తున్నారు.ఫేక్ శానిటైజర్లను తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఫేక్ శానిటైజర్ల దందాను బట్టబయలు చేశారు.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చర్లపల్లిలో హైదరాబాద్కు చెందిన సెవెన్ హిల్స్ సాఫ్ట్గెల్ కంపెనీ ఎండీ కాకర్ల పుడి కృష్ణ కిరణ్, జనరల్ మేనేజర్ వేమూరి వెంకట సుబ్రమణ్యంలు సెమున్స్ క్లీన్సెం హ్యాండ్ శానిటైజర్ మరియు కౌస్తుబా కొక్లీన్ 19 హ్యాండ్ శానిటైజర్ పేరుతో శానిటైజర్ల బాటిళ్లను తెలుగు రాష్ట్రాలకు చెందిన మెడికల్ షాపులకు అమ్మకాలు జరుపుతున్నారు.
నిందితుడు కాకర్లాపుడి కృష్ణ కిరణ్ 2018 లో ఆయుష్ సాఫ్ట్గెల్ క్యాప్సూల్స్ & సిరప్స్ పేరుతో లైసెన్స్ పొందారు. చర్లపల్లి లో ఆయుష్ సాఫ్ట్గెల్ క్యాప్సూల్స్ మరియు సిరప్లను తయారు చేయడం ప్రారంభించారు. ఆ కంపెనీతో పాటు మరో కంపెనీ పేరుతో బాటిళ్లలో రకరకాల క్రీముల్ని నింపి ఫేక్ శానిటైజర్లను అమ్మకాలు జరిపిస్తున్నారు. ఫేక్ శానిటైజర్ల సమాచారం అందడంతో రాచకొండ ఎస్ ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో సుమారు 1.4కోట్ల విలువైన లక్షశానిటైజర్ల బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కంపెనీ నిర్వహికులైన కృష్ణ కిరణ్, జనరల్ మేనేజర్ వెంకట సుబ్రమణ్యంపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955, మరియు ఐపీసీ, డ్రగ్స్ సంబంధించిన యాక్ట్ లో పలు కేసులన్ని నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఇప్పటివరకు నిందితులు రూ .1,4 కోట్ల విలువైన 1 లక్ష బాటిళ్లను తయారు చేసి విక్రయించినట్లు తేలింది.
