- నకిలీ ఐపీఎస్.. వసూళ్లే టార్గెట్
- ఫేక్ ఐడీ కార్డులు, ఇద్దరు గన్మెన్లతో బిల్డప్
హైదరాబాద్, వెలుగు: ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా చలామణి అవుతున్న ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్లోని ఫిలింనగర్ పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేశారు. టీజీఐఐసీ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్గా చెప్పుకుంటూ ఇండస్ట్రీల కోసం భూములు కేటాయిస్తానంటూ మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుడి నుంచి రెండు సెల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ పేరుతో ముద్రించిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గన్మెన్లుగా పనిచేసిన తమిళనాడుకు చెందిన మాజీ సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.ఈ ఫేక్ ఐపీఎస్ వివరాలను వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు.
యానిమేషన్ అనుభవంతో ఫేక్ ఐడీ కార్డులు
కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ (39).. 3-డీ యానిమేషన్ కోర్సు చేశాడు. హైదరాబాద్లోని చంపాపేటలో కొంతకాలం యానిమేషన్ సంస్థ నిర్వహించాడు. యానిమేషన్లో ఉన్న అనుభవంతో ఫేక్ ఐడీ కార్డులు తయారు చేయడం ప్రారంభించాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారిగా తన పేరిట ఐడీ కార్డులు తయారు చేసుకున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్తోపాటు ఎన్ఐఏలో స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్నట్టు చలామణి అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్గా చెప్పుకునేవాడు. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమల్ను గన్మెన్లుగా నియమించుకున్నాడు. ఇటీవలి కాలంలో చంపాపేట నుంచి సైబరాబాద్లోని షేక్పేటకు మకాం మార్చాడు.
సంపన్నులను ట్రాప్ చేసేందుకు వేషాలు
ఐటీ ఉద్యోగులు, సంపన్నులు నివాసం ఉండే షేక్పేట్లోని అపర్ణ ఔరా అపార్టుమెంట్లో నివాసం ఉండేవాడు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా బిల్డప్ ఇచ్చేవాడు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాంటి పనులైనా సులువుగా చేసేస్తానని చెప్పేవాడు. కాంట్రాక్టులు, నేషనల్ ప్రాజెక్టులు ఇప్పిస్తానని నమ్మించేవాడు. ప్రతిరోజూ మార్నింగ్ వాక్లో కలిసే వారికి తన గురించి గొప్పగా చెప్పుకునేవాడు. నిరంతరం సీక్రెట్ ఆపరేషన్లు చేస్తుంటానని.. దేశంలో ఎక్కడైనా సరే స్పెషల్ ఆపరేషన్లకు వెళ్తుంటానని స్థానికులకు చెప్పేవాడు. గన్ మెన్లతో కలిసి షేక్పేటలోని గోల్డ్ జిమ్కు వెళ్లేవాడు. జిమ్ చేస్తున్న సమయంలో ఫోన్ రింగ్ అయ్యేలా గమ్మెన్లతో కాల్ చేయించేవాడు. ఫోన్ వచ్చిన వెంటనే స్పెషల్ ఆపరేషన్కు వెళ్తున్నానంటూ హడావిడిగా వెళ్లిపోయేవాడు. ఇదంతా నిజమేనని నమ్మిన స్థానికులు శశికాంత్తో పరిచయం పెంచుకున్నారు.
గోల్డ్ జిమ్ ఎండీని మోసం చేసి దొరికిపోయాడు
ఈ క్రమంలోనే శశికాంత్ తన క్రిమినల్ బ్రెయిన్కు పదును పెట్టాడు. టీజీఐఐసీలో మైన్స్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నానని మరో అవతారం ఎత్తాడు. ఖాళీ స్థలాలు కేటాయించే విభాగానికి తాను స్పెషల్ ఐఏఎస్ అధికారినంటూ గోల్డ్ జిమ్ ఎండీ అలీ హసన్ను నమ్మించాడు. ఇండస్ట్రీ స్థాపించేందుకు స్థలం కేటాయింపు చేపిస్తానని ఓ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ తయారు చేసి చూపించాడు. ఇందుకుగానూ రూ. 10.50 లక్షలు వసూలు చేశాడు. ఇదే క్రమంలో జిమ్కు వచ్చే మరో వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు. కాగా, ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాకపోవడంతో శశికాంత్ ప్రవర్తనపై అలీ హసన్కు అనుమానం వచ్చి, ఆరా తీశాడు. ఇది గమనించిన శశికాంత్ షేక్పేట నుంచి ఎస్కేప్ అయ్యాడు. దీంతో బాధితుడు ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నంబర్, టవర్ లొకేషన్ ఆధారంగా శశికాంత్ను అరెస్ట్ చేశారు. శశికాంత్పై ఉన్న కేసుల చిట్టాను సేకరిస్తున్నారు.
