
- భార్య మృతి.. భర్త, పిల్లల పరిస్థితి విషమం
- మెదక్ పట్టణంలో ఘటన.. ఫ్యామిలీ గొడవలే కారణం!
మెదక్/మెదక్ టౌన్, వెలుగు: ఓ కుటుంబం మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో భార్య స్పాట్లోనే చనిపోగా.. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. భర్త , పిల్లల పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వీరిని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన భార్యా భర్తలు డాకొల్ల రమ్య, నవీన్, వారి ఇద్దరు కూతుళ్లు రుత్విక, శశ్వికగా పోలీసులు గుర్తించారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా, కేసు విచారణలో భాగంగా కోర్టుకు వచ్చినట్లు తెలుస్తున్నది. రాత్రి 8.30 నుంచి 9 గంటల మధ్య పై అంతస్తు నుంచి భార్యాభర్తలిద్దరూ పిల్లలతో కలిసి దూకినట్లు అనుమానిస్తున్నారు.
ఆ సమయం దాకా అక్కడే దాక్కొని ఉన్నారా? లేదంటే బయటకు వెళ్లి మళ్లీ వచ్చారా? అనేది తెలియడం లేదు. పై నుంచి దూకిన వెంటనే తీవ్రంగా గాయపడిన రమ్య (25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త నవీన్, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడగా.. వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని మెదక్ ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్ సందర్శించారు. మెదక్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ కు చెందిన రమ్యకు సిద్దిపేట జిల్లా దౌల్తా బాద్ కు చెందిన నవీన్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో ఆరు నెలలుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేధింపులు భరించలేక కొన్ని నెలల క్రితం రమ్య.. లక్ష్మాపూర్ లోని పుట్టింటికి వెళ్లింది. భార్య రావడం లేదన్న కోపంతో రెండు నెలల కింద నవీన్ లక్ష్మాపూర్లోని అత్తారింటిపై దీపావళి పటాకులు విసిరి భయపెట్టేందుకు ప్రయత్నించాడు.
దాంతో వారు నవీన్ పై కేసు పెట్టగా.. కొన్నాళ్ల పాటు జైలు కు వెళ్లివచ్చినట్టు తెలిసింది. ఆ కేసు విషయంలోనే శనివారం నవీన్, రమ్య రామాయంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. కోర్టు నుంచి పేపర్స్ తీసుకు రావాలని పోలీసులు చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో మెదక్ కోర్టుకు వచ్చిన వారు.. పిల్లలతో కలిసి కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకినట్లు భావిస్తున్నారు.