వెలుగు నెట్వర్క్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పలు పట్టణాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు వార్డులో బరిలో నిలిచిన తల్లీబిడ్డలు, భార్యాభర్తలు విజయం సాధించారు. మెదక్ పట్టణంలో తల్లీ కొడుకులు కౌన్సిలర్లుగా గెలిచారు.
14వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి లక్ష్మి, 15వ వార్డు నుంచి అదే పార్టీ నుంచి కొడుకు నరేశ్విజయం సాధించారు. మరోవైపు రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గజవాడ లావణ్య గెలుపొందగా, 7వ వార్డులో అదే పార్టీ నుంచి ఆమె భర్త గజవాడ నాగరాజు విజయం సాధించారు.
నిర్మల్ పట్టణంలోని 36వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అప్పాల కావ్య, 37వ వార్డు నుంచి ఆమె భర్త అప్పాల గణేశ్ చక్రవర్తి గెలిచారు. కావ్య చైర్పర్సన్ బరిలో ఉన్నారు. 27వ వార్డు నుంచి అహేషా కౌసర్, 39వ వార్డు నుంచి ఆమె భర్త తహీద్ ఉద్దీన్ రప్పు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
వీరిద్దరు రెండోసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. వనపర్తి 15వ వార్డులో కాంగ్రెస్ నుంచి ఎర్వ సౌమ్య గెలుపొందగా, 22వ వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆమె తల్లి ఎర్వ అరుణ గెలుపొందారు.
