మా బిడ్డని దొంగ బాబానే చంపిండు

మా బిడ్డని దొంగ బాబానే చంపిండు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ దొంగ బాబా ఆరోగ్య సమస్యలు తీర్చాలని వెళ్లిన మహిళలను లోబరుచుకుంటున్నాడని, మాట వినని వారిని చంపేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఓ మహిళ  డెడ్​బాడీతో కుటుంబ సభ్యులు గాంధీనగర్ సమీపంలోని దర్గా వద్ద ఆందోళనకు దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం దురాజ్ పల్లికి చెందిన దుర్గయ్య, రాజరాజేశ్వరీ దంపతులు ఆరోగ్య సమస్యల కారణంగా గాంధీ నగర్ సమీపంలోని దర్గాలో పూజలు చేసేవారు. దర్గా నిర్వాహకుడు భిక్షపతి వారికి నాటు మందులు ఇచ్చేవాడు. కొన్నేళ్లుగా అతని వద్దకే వస్తున్న రాజరాజేశ్వరిపై భిక్షపతి కన్నుపడింది. కొన్నిరోజుల కింద రాజేశ్వరి కూతురు శ్రావణి(20) అనారోగ్యానికి గురవ్వడంతో భిక్షపతి వద్దకు తీసుకెళ్లింది. అతను పసరు మందు ఇచ్చి నాటు వైద్యం చేశాడు. అదే సమయంలో రాజరాజేశ్వరిని తన కోరిక తీర్చాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించి దురాజ్​పల్లికి వచ్చేసింది.

4 రోజుల కింద శ్రావణి మరోసారి అనారోగ్యానికి గురై కళ్లు తిరిగి పడిపోయింది. కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి శ్రావణిని దర్గాకు తీసుకెళ్లారు. వైద్యానికి టైం పడుతుందని రాత్రికి ఇక్కడే ఉండాలని చెప్పడంతో భార్య రాజరాజేశ్వరిని, శ్రావణిని అక్కడే ఉంచి దుర్గయ్య ఇంటికి వెళ్లాడు. అదే అదునుగా భావించిన భిక్షపతి తిరిగి తన కోరిక తీర్చాలని రాజరాజేశ్వరిని అడిగాడు. లేకుంటే శ్రావణికి వైద్యం చేయనని బెదిరించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. మంగళవారం ఉదయం లేచి చూసేసరికి శ్రావణి మృతి చెంది ఉంది. రాజ రాజేశ్వరి ఒప్పుకోకపోవడంతో శ్రావణిని భిక్షపతి  చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భిక్షపతిని బంధించారు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకొని వెళ్తుండగా తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ కూతురిని చంపినట్లే అమాయక మహిళలను మోసం చేస్తూ చంపేస్తున్నాడని ఆరోపించారు.