
ఎల్బీనగర్, వెలుగు: ప్రముఖ సినీనటుడు రాజీవ్ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూమికి సంబంధించి రాచకొండ కమిషనరేట్పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. హయత్నగర్ పోలీస్స్టేషన్లో ఆయన మేనేజర్ పై నమోదైన కేసులో విచారణకు రావాలని హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాములలో రాజీవ్కనకాల తండ్రి దేవదాస్కనకాలకు ఓ ప్లాటు ఉంది.
దాన్ని రాజీవ్ కనకాల మేనేజర్, సినీ నిర్మాత అయిన విజయ్చౌదరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. విజయ్చౌదరి సదరు ప్లాటును ఎల్బీనగర్కు చెందిన శ్రావణ్రెడ్డికి అమ్మాడు. ఏడాది కింద శ్రావణ్రెడ్డి తన ప్లాటు పొజిషన్కు వెళ్లగా.. సదరు నంబర్ప్లాట్లేకుండా ఆనవాళ్లు చెరిపేసి ఉన్నాయి. దీనిపై శ్రావణ్ రెడ్డి.. విజయ్ చౌదరిని సంప్రదించగా ప్లాట్ఇవ్వబోనని దానిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామంటూ దాటవేత సమాధానమిచ్చారు.
ఏడాదిగా ఎన్నిసార్లు సంప్రదించినా ప్లాటును చూపకపోగా సదరు ప్లాటు ఉన్నదని ఒకసారి.. అసలు లేదని ఒకసారి.. ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇంటికి వెళ్లి నిలదీస్తే.. అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ప్లాటు విక్రయదారు, వెంచర్భాగస్వామి, సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చారు.
అయితే, ప్లాట్ విక్రయంలో ఉద్దేశ్యపూర్వకంగానే మోసం జరిగిందని ఇందులో రాజీవ్ కనకాల హస్తం ఉందని బాధితుడు, విజయ్ చౌదరి పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ ప్లాటు విషయంలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.